YSRCP News :   అధికారంలో ఉన్నామన్న కారణంగా అనుబంధసంఘాల నేతలందరూ రిలాక్స్ అయ్యారని వైసీపీ   అనుబంధ సంఘాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీసులో ఆయన అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చూపించారని అనుబంధ సంఘాల నేతలపై విజయసాయిరెడ్డి మమండిపడ్డారు.  అనుబంధ విభాగాలతో ఆయన వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులకు విజయ సాయి స్పష్టం చేశారు. పార్టీ అనుబంధ విభాగాలైన మహిళ,యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా విజయసాయిరెడ్డి  సమావేశం నిర్వహించారు. 


రిలాక్స్ అయింది చాలన్న విజయసాయిరెడ్డి  


పార్టీ అనుబంధ విభాగాలతో విడివిడిగా జరిగిన సమావేశంలో అధ్యక్షుల, జోనల్ ఇన్చార్జిల, జిల్లాల అధ్యక్షులు తమ తమ అభిప్రాయాలను విజయసాయి రెడ్డి కి చెప్పడంతో పాటు పలు సూచనలు, సలహాలు అందించారు.  ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.  వీలైనంత త్వరగా వైసిపి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను పూర్తి చేయాలని వారికి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఇందులో భాగంగా జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీల్లో సభ్యులను భర్తీ చేయాలని తెలిపారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ, జనరల్ సెక్రెటరీ పదవులను పూర్తి చేయాలన్నారు.


 ఫుల్ టైం పని చేయాలని అనుబంధ సంఘాలకు ఆదేశం


అధికారంలో ఉన్నామనే భావనతో చాలా మంది రిలాక్స్ మూడ్ లో ఉన్నారని,ఇక పై పూర్తి స్దాయిలో ఎన్నిలకు రెడీ అవ్వాల్సిన సమయం దగ్గరపడిందని విజయ సాయి స్పష్టం చేశారు.  మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించాలని సూచించారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని వారికి పిలుపునిచ్చారు.. పార్టీ కార్యక్రమాలతో పాటు,అభివృద్ధి కార్యక్రమాల్లో అనుబంద విభాగాల భాగస్వామ్యం కల్పించే విధంగా చూస్తామన్నారు.. ఫుల్ టైం కార్యకలాపాలను వేగవంతం చేయాలని సూచించారు.  


 
జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు,మార్పులను అందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ విద్యార్థి విభాగం సమావేశంలో విద్యార్థి నాయకులకు నిర్దేశం చేశారు.. గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ నాలుగేళ్ల కాలంలో జగన్  తీసుకొచ్చిన సంస్కరణలు అందరికీ వివరించే విధంగా 'విద్యా వ్యవస్థలో పురోగతి' కార్యక్రమాన్ని జోనల్, జిల్లా స్థాయిలో చేపట్టాలని విజయసాయిరెడ్డి సూచించారు.. 2019 కి ముందు వైఎస్ఆర్సిపీ విద్యార్థి విభాగంలో పనిచేసిన నాయకులు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని, వారికి జగన్మోహన్ రెడ్డి  మంచి అవకాశాలు కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి కష్టపడి పని చేయాలని విద్యార్థి విభాగ నాయకులకు పిలుపునిచ్చారు..



వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వరుదు కళ్యాణి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత నేతృత్వంలో పార్టీ మహిళా విభాగం సమావేశం జరిగింది..  వైకాపా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి కమిటీల అవసరం చాలా ఉందన్నారు. సుమారు 15 రోజుల్లో కమిటీలను పూర్తి చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా మహిళ విభాగ జిల్లా,మండల కమిటిలను నియమిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి కృషి చేయాలన్నారు.. వరుదు కళ్యాణి మాట్లాడుతూ...మహిళల సాధికారతకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా మహిళలకు ఎంతో తోడ్పాటును అందజేస్తున్నారన్నారు. ఇలా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.


 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి మెదటి నుండి కీలకంగా వ్యవహరిచస్తున్న వర్గాల్లో ఎస్సీ,ఎస్టీ వర్గాలు ఉన్నాయి.దీంతో ఆయా సంఘాలతో కూడ విజయ సాయి కీలకంగా సమావేశం నిర్వహిస్తున్నారు.పార్టి కార్యకలాపాల పై ఆయన పార్టి క్యాడర్ కు పూర్తి స్దాయిలో దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు.