కోడెల శివరాం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇస్తామని చెప్పి ఆయన తీసుకున్న డబ్బులు ఇప్పటి వరకు చెల్లించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోడెల తమ డబ్బు చెల్లించకపోతే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాతే తన తండ్రి కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తన మన అన్న తేడా‌ లేకుండా  తండ్రి అధికారాలను అడ్డు పెట్టుకొని టీడీపీ నాయకులను బెదిరించి పెద్ద ఎత్తున శివరాం డబ్బులు వసూలు చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివరాం బాధితులు అందరు ఏకమై.. కొడుకు అవీనీతి కారణంగా పరువు పోయి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.


టీడీపీలో వర్గ పోరు
సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ను ప్రతిపాదించిన తర్వాత పార్టీ రెండు  గ్రూపులు విడిపోయింది. ఆప్పటి వరకు ఇంచార్జ్ పదవి కోసం పోటీ పడిన ఆశావహులు అధిష్ఠాన నిర్ణయంతో సైలెంట్ అయ్యారు. కానీ కోడెల శివరాం మాత్రం ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నాను ఇంచార్జ్ గా ఒప్పుకోనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి సత్తెనపల్లిలో టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కన్నాతో కలసి మిగతా నాయకులు ఒక వర్గం.. కోడెల శివరాం మరో వర్గంగా విడిపోయారు. టీడీపీ నేతలు నచ్చచెప్పే బుజ్జగించే  ప్రయత్నం చేసిన శివరాం ససేమిరా అన్నారు.


డబ్బులు ఇచ్చి మాట్లాడు
పార్టీ అధిష్ఠానంతో పోటీకి సిద్దమయ్యారు కోడెల‌ శివరాం.. తన క్యాడర్ ను కాపాడుకుంటూ నియోజకవర్గంలో తన పరపతిని పెంచుకొనేందుకు  సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో పర్యటన ప్రారంభించారు. తనకు పట్టున్న గ్రామాలలోకి వెళ్తూ వారి సమస్యలపై దృష్టిపెట్టడం చేస్తున్నారు. ఈ మద్య ఒక గ్రామంలో చర్చిని సందర్శించి విరాళంగా రూ.50 వేలు ఇచ్చారు. 
ముప్పాళ్ళ మండలంలో రుద్రవరం గ్రామంలో దివంగత నేత కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేశారు. 


ఈ విగ్రహ ప్రారంభోత్సవం శివరాం చేస్తున్నట్లు ఆ గ్రామస్తులకు సమాచారం అందింది. ఇదే గ్రామంలో యార్లగడ్డ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.60 లక్షలు శివరాం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తాను టీడీపీ పార్టీ ఆభిమానని.. కోడెలతో కలసి పనిచేశానని చెబుతున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ విజయం కోసం చాలా కష్టపడ్డానని అంటున్నారు. పార్టీ విజయం కోసం ఎంతో డబ్బు వెచ్చించానని చెబుతున్నారు. గెలిచిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని అంటున్నారు. తనను బెదిరించి తన లిక్కర్ వ్యాపారంపై అధికారులను పంపి నానా ఇబ్బందులకు గురిచేసి ట్రిప్పుకు 20 లక్షల‌ చొప్పున మూడు సార్లుగా 60 లక్షలు తీసుకున్నాడని  తెలిపారు. తండ్రి కోడెల శినప్రసాద్ కు చెప్పగా ఏదో విధంగా న్యయం చేస్తానని చెప్పారని.. తర్వాత పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకోగా డబ్బులు ఇస్తానని చెప్పి, రెండు సంవత్సరాల నుంచి ‌ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి విగ్రహం ప్రారంభించుకోవాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు యార్లగడ్డ వెంకటేశ్వర్లు.


ఫిర్యాదుల పరంపర


గతంలో కూడా ఆనేక మంది శివరాం బాధితులు బయటకు వచ్చారు. పోలీస్టేషన్ లో‌ కూడా ఫిర్యాదు చేశారు. ఆన్నా క్యాంటిన్ లో భోజనాన్ని కూడా వదలకుండా అవినీతికి తెరతీశాడని స్థానికులు అంటుంటారు. తన ఫార్మసీ కంపెనీలో తయారైన మందులు అమ్మాలని డాక్టర్లను బెదిరించారని. ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది వద్ద లక్షలలో డబ్బులు కాజేశాడని చెబుతారు. మరో వ్యక్తి తనకు మూడు కోట్లు ఇవ్వాలని ప్రారంభానికి వస్తే నిలదీస్తానని చెబుతున్నారు.


కోడెల మృతికి కారణం..
కొడెల మృతికి ఎవరు కారణం అని బాధితుడు యార్లగడ్డ వెంకటేశ్వర్లు ప్రశ్నిస్తున్నారు. మితిమీరిన అవినీతి కారణంగా అప్రతిష్ఠ పాలై కొడుకు శివరాంను కంట్రోల్ చేయలేక క్యాడర్‌కు మొహం చూపలేక తీవ్ర మానసిక ఒత్తిడితో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శిస్తున్నారు. కోడెల మరణం తర్వాత కోడెల శివరాంపై ఆరోపణలు, కేసులు కొంత మేరకు తగ్గాయని, ఎప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ఇంచార్జ్ నియామకం శివరాం వ్యతిరేకించాడో అప్పటి నుంచి మళ్లీ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజులలో కోడెల శివరాంను మరింతగా టార్గెట్ చేసే పరిస్థితి కనబడుతుంది.