Vidya Deevena in Andhra Pradesh | అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై ఫోకస్ చేసింది. విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందేలా చేయడంలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ (Fee Reimbursement) విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను రూపొందించాలని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 


ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... వసతి దీవెన, విద్యాదీవెన సంబంధించి వైసీపీ ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా కాలేజీల్లో నిలిచిపోయినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఏపీలో కళాశాలల్లో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు నియామించిన సరేనన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టం, సమస్యలు, కేసులపై విద్యార్థులకు అవేర్ నెస్ తెచ్చేందుకు స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి లోకేష్ చెప్పారు. 


లెక్చరర్ పోస్టుల భర్తీపై చర్చ 
ఏపీలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ ఈ సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా, టాలెంట్ ఆధారంగా లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని అధికారులకు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్, ఎగ్జామినేషన్ షెడ్యూలు, క్యాలండర్ తయారుచేయాలని సూచించారు. దాంతో విద్యార్థులకు నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడికి తేలికగా ఉంటుందని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రవేశాలు తగ్గిపోవడంపై లోకేష్ ఆందోళన
రాష్ట్రంలో గత అయిదేళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంపై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్ గా తీసుకుని, అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపర్చాలని అన్నారు.


యూనివర్సిటీల ఏర్పాటుపై చర్చ
ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏమేరకు ఉండాలనే అంశాలపై సమావేశంలో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఏపీలోని ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కు కాలేజీల సెలక్షన్, రాష్ట్రంలో శ్రీ పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం లాంటి అంశాలపై సమీక్షించారు. మంత్రి లోకేష్ నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, ఉన్నత విద్యశాఖ ఇన్ ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ బి.నవ్య తదితరులు పాల్గొన్నారు.


Also Read: https://telugu.abplive.com/andhra-pradesh/ap-cabinet-key-decisions-latest-updates-171676/amp