TDP Leaders Protest: బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్య అందకుండా ముఖ్యమంత్రి జగన్‌ మో‌హన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని గుంటూరు జిల్లా బీసీ సెల్ నేతలు సోమవారం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లను అమ్ముకోవడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేస్తున్న విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ మోసపూరిత మాటలు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో వారందరికీ వైద్య విద్యను దూరం చేశారని విమర్శించారు. 


ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటూ పేద విద్యార్థుల వైద్య విద్య కలను చిదిమేశాడని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సర్కారీ కాలేజీల్లో మెడికల్ సీట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు తేడా లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కన్వీనర్ కోటాలోనే ఇన్నాళ్లూ భర్తీ చేస్తున్నారని, మెరిట్ ఆధారంగానే విద్యార్థులు ఈ కాలేజీల్లో సీట్లు పొందుతూ వచ్చారని, కానీ జగన్ ధన దాహంతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వస్తున్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్ భవిష్యత్ మిగిలిన ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లను అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గం అని వారు మండిపడ్డారు.


సీఎం జగన్ మెడికల్ సీట్లను మూడు కేటగిరీలుగా విభజించి అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ 25% ఓపెన్, 25% రిజర్వేషన్) 50% సీట్లు, మిగిలిన 50% సీట్లలో 35% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ (బి కేటగిరీ) రూ.12లక్షలు, మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోటా (సి కేటగిరీ)కి రూ.20 లక్షలుగా నిర్ణయించారని ఆరోపించారు. కొత్త కాలేజీల్లోని 160 సీట్లు బడుగులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల పక్షమని చెప్పుకునే జగన్ పేద విద్యార్థులు ఏడాదికి రూ.20 లక్షల ఫీజు కడితేనే ఎంబీబీఎస్ అనడటం ఎంతవరకు సమంజం? అని వారు ప్రశ్నించారు. మెడికల్ విద్యలో బీసీలకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‍కు వినతిపత్రం అందజేశారు.


ఒక్కో కాలేజీలో 150 చొప్పున ఐదు కాలేజీల్లో 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, వాటిలో ఆలిండియా కోటా (15%) కింద 112 సీట్లు పోతాయని. మిగిలిన 638 సీట్లను కన్వీనర్ కోటాలో మెరిట్ విద్యార్ధులకు కేటాయించాలని, కానీ జగన్ ఏ, బీ, సీ కేటగిరీలు సృష్టించి డబ్బు దండుకున్నారని ఆరోపించారు. టీడీపీ 1975 మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదివిస్తే జగన్ విదేశీ విద్య రద్దు చేశారని విమర్శించారు. టీడీపీ స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణిచ్చి 9224 మంది ఉన్నత ఉద్యోగాలు కల్పిస్తే వాటిని జగన్ రద్దు చేశారని అన్నారు.


గన్ అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, కార్పొరేషన్ల రుణాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, బీసీ మహిళలకు పారిశ్రామిక రాయితీలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశారని అన్నారు.  బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాలు కల్పించకుండా డ్రాపౌట్స్ పెంచారని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించతలపెట్టిన రెసిడెన్షియల్ భవనాలు మధ్యలో నిలిపివేశారని ఆరోపించారు. ఇన్ని రకాలుగా బీసీలను చదువులకు దూరం చేసిన జగన్ ఇప్పుడు ఆదాయం కోసం మెడికల్ సీట్లను కూడా అమ్ముకుంటూ బీసీలను దగా చేస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే.. మెడికల్ సీట్లలో బీసీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సీట్లను అమ్ముకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.