Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ఆమె చేస్తున్న సాహన యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

Continues below advertisement

సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. 

Continues below advertisement

దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ ని కలిసి.. ఆయన చూపిన శ్రద్దకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని పవన్ కల్యాణ్ పంచుకున్నారు.

జెన్ జీ వ్లాగర్ స్వాతి రోజా ఇటీవల 12 జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా శ్రీశైలం వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె ఒంటరిగా ఆలయంలో అందించే వసతి గృంలో బస చేయాలనుకునేటప్పుడు ఆలయ అధికారులు అనుమతి ఇవ్వలేదు. స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. పోలీసులను సంప్రదించగా భద్రతా కారణాలతో డార్మిటరీలో బస చేయాలని సూచించారు. ఇది ఆమెకు ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపించింది. ఇదే విషయాన్ని తన యూట్యూబ్‌వ్లాగ్‌లో చెప్పారు. సమస్యలను హైలైట్‌ చేస్తూ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. 

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ వీడియోను చూసి, వెంటనే స్పందించారు. మహిళా ట్రావెల్ వ్లాగర్‌కు వసతి సౌకర్యాలు సులభంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ శ్రీశైలం రావాలని సూచించారు. రెండోసారి కుటుంబంతో వచ్చిన స్వాతి గణేష్‌ సదన్‌లో సౌకర్యవంతమైన బస చేసి దర్శనం చేసుకున్నారు. దీనిపై ఆమె పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞత తెలిపారు.