Perni Nani challenges Chandrababu over Guest House Issue: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని.. క్విడ్ ప్రోకోపై మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పూలింగ్‌లో లేని గెస్ట్‌హౌస్‌ చంద్రబాబుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చట్ట ప్రకారం నిందితుల ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసింది. గతంలో లింగమనేని ఇంటిని ప్రభుత్వానికే ఇచ్చారని చంద్రబాబే అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సింది. స్టేలు తొలగటంతో ఇప్పుడు చర్యలు చేపట్టారని, చంద్రబాబు ప్రతిదానికీ స్టేలకు వెళ్లటం ఎందుకు? తప్పుచేయకపోతే.. ధైర్యంగా విచారణ ఎదుర్కోండి అని సవాల్ విసిరారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. దోషులుగా తేలితే ఎంతటి వారిపైనా చర్యలుంటాయి. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోకూడదా? సీబీసీఐడీ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని పేర్ని నాని తెలిపారు. 


అమరావతి రాజధానిలో జరిగిన అక్రమాలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధారాలతో సహా పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్‌పై సీబీసీఐడీ ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీలో భాగంగా లింగమనేని రమేష్‌, ఇతర వ్యక్తులకు లబ్ధి చేకూరేలా జరిగిందని విచారణలో వెల్లడైందన్నారు. నగదు, ఆస్తి చేతులు మారి లబ్ధి జరిగిందని సీబీసీఐడీ తేల్చటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. దాని ప్రకారం నిందితుల ఆస్తులు అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు.


ఆ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉంటున్నారు?: పేర్ని నాని
‘ లింగమనేని రమేష్‌ లబ్ధి పొందిన దానికి ప్రతిఫలంగా చంద్రబాబుకు కరకట్ట గెస్ట్‌ హౌస్‌ ఇచ్చిపుచ్చుకున్నట్లుగా సీబీసీఐడీ విచారణలో వెల్లడైంది. సీబీసీఐడీ సిఫార్సుల మేరకు ఆస్తుల్ని అటాచ్‌ చేస్తూ హోంశాఖ జీవోలను విడుదల చేసింది. ఇది లింగమనేని రమేష్‌ ఆస్తి. పూలింగ్‌లో ప్రభుత్వానికి అప్పజెప్పారు. అందుకు నేను ఉంటున్నానని మీడియాతో చంద్రబాబు అన్నారు. కానీ పూలింగ్‌లో ఇచ్చినట్లు ఆధారాలు లేవు. మరి, చంద్రబాబు ఉచితంగా ఆ ఇంటిలో ఎందుకు ఉంటున్నారో చెప్పాలి కదా. లింగమనేని రమేష్‌కు అద్దె కడుతున్నారా? ఒక్క లింగమనేని రమేష్‌ మాత్రమే కాదు.. చంద్రబాబు తప్పుడు విధానాల వల్ల చాలా మంది వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరింది. వారి ఆస్తులు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని’ పేర్ని నాని పేర్కొన్నారు. 


పెద్ద లాయర్లను పెట్టి.. స్టేలు ఎందుకు? పేర్ని నాని ఫైర్ 
- స్టేలు తెచ్చుకుని దాక్కోవటం ఎందుకు? దమ్ముంటే విచారణ ఎదుర్కోమనండి. డబ్బుండి.. పెద్ద పెద్ద ప్లీడర్లను తెచ్చి కోర్టుల్లో వింత వాదనలు వినిపించి.. బెయిల్‌లు, స్టేలు తెచ్చుకోవడం ఎందుకు. విచారణ ఎదుర్కోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. లింగమనేని రమేష్‌ది ఇల్లు అయితే.. చంద్రబాబు ఎందుకు ఉంటున్నాడు. వీళ్లద్దరి సంబంధం ఏంటి? పోనీ, అద్దెకు ఇచ్చారా? అద్దె కడుతున్నారా? పూలింగ్‌లో లేని ఆస్తి, పూలింగ్‌ కాని ఆస్తిని ప్రభుత్వానికి అప్పజెప్పారని చంద్రబాబు ఎలా చెప్పారు...? అని ప్రశ్నించారు. కక్షసాధింపులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇన్నర్ రింగ్‌ రోడ్డు వేస్తున్నారని అలైన్‌మెంట్ ఇస్తున్నట్లు జీఓలు ఉన్నాయి. చంద్రబాబు సంతకాలతో నోట్‌ఫైల్స్‌ ఉన్నాయి. రింగ్‌రోడ్డుపై సీఆర్‌డీఏలో చెప్పారు. ఇవాళ కాదని ఎలా అంటారు. ఆ చెప్పేది ఏమిటో సీబీసీఐడీ దగ్గరకు వెళ్లి చెప్పాలని చంద్రబాబుకు పేర్ని నాని సూచించారు. 
తప్పు చేసినవారిపై చర్యలు తప్పవు..
‘లింగమనేని రమేష్‌ది రెండు ఆవుల దూడ వ్యవహారం. అటు పవన్‌ కల్యాణ్‌ దగ్గర.. ఇటు చంద్రబాబు దగ్గర ఉంటాడు. కోట్లాది విలువైన ఆస్తుల్ని లక్షలకే పవన్‌కు ఇచ్చేస్తాడు. మరోవైపు చంద్రబాబుకేమో ఊరికే ఇచ్చేశాడు. అక్కడా ఇక్కడా పదేళ్లుగా ఇద్దరికీ పాలు ఇచ్చే ఆస్తి లింగమనేని రమేష్‌. సాక్ష్యాలు ఆధారంగా మా ప్రభుత్వం ఎవరైతే తప్పులు చేశారో వారిని దోషులు చేయటం జరుగుతుంది. అంతకుమించి ఆలోచించే పనిలేదు’ అని పేర్ని నాని అన్నారు.


గతంలో అగ్రిగోల్డ్ విషయంలోనూ ఇలాగే అటాచ్ చేశారు
- రాజధానిలో తప్పులు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ విచారణలో తప్పులు రుజువు అయ్యాయని ప్రభుత్వం రెండు జీవోలు ఇవ్వటం జరిగింది. గతంలో అగ్రిగోల్డ్, ఇతర వ్యవహారాలు సీబీసీఐడీ వ్యవహరించింది కదా. అలాగే ఇక్కడా అంతే. తప్పులు చేసిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. 
- మీడియా వద్ద జీవోలు ఉన్నాయని భావిస్తున్నాను. కావాలంటే తెప్పించి అందజేస్తాను. 
- ఎవరైనా తప్పులు చేసి.. మీడియా అనో, ఇతరత్రా సాకులు చూపుతూ చర్యలు తీసుకోవద్దు అనటం సరికాదు. 
- ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంది.. కానీ, కోర్టులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు, ఆయన బినామీదారులు స్టేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టేలు తొలిగాయి.
- లింగమనేని రమేష్‌ స్టార్ వ్యాపారస్తుడు. విమానాల కంపెనీ పెట్టారు. తర్వాత తీసేశారు. సినిమా యాక్టర్‌కు పార్టీ ఆఫీసు, ఇల్లు ఇచ్చాడు. ఎన్టీఆర్‌ చెప్పినట్లు తనకంటే గొప్ప యాక్టర్‌ చంద్రబాబుకు నది ఒడ్డున గెస్ట్ హౌస్‌ ఇచ్చాడు. స్టార్ బిజినెస్‌ మేన్‌ లింగమనేని మీద మాత్రమే మాట్లాడటం ఎందుకు? మిగతా ముద్దాయిల పేర్ల మీద దృష్టి పెట్టండి. 
- దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. దాంట్లో ఎవరు దోషులుంటే వారు శిక్ష అనుభవిస్తారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.