Union Budget Amaravathi Funds :  అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసింది. అలా ఇలా కాదు ఏకంగా పది హేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని .. అదీ కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక  అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగిపోయిన నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పుంజుకోనున్నాయి. పరిపాలనా నగరానికి ఓ రూపు రావడానికి రాష్ట్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సాయం అందనుంది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరగనున్నాయి. దీంతో అమరావతి ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. 


అమరావతిలో గతంలో ఎప్పుడూ ఇవ్వనంత సాయం


2014లో రాజధాని లేకుండా ఏపీ ఏర్పాటయింది. ఎన్నికల ప్రచారంలో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. స్వయంగా ప్రధాని మోదీ ఇలాంటి ప్రకటన చేశారు. కారణం ఏదైనా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అనుకున్నంత సాయం రాలేదు. ఏపీ రాజధాని అమరావతి ప్రణాళికలు మోదీ సహకరించారు కానీ నిధుల విషయంలో మాత్రం అనుకున్నంత సపోర్టు రాలేదు. కేంద్రపట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చొరవతో రెండున్నర వేల కోట్లు మంజూరయ్యాయి కానీ.. అందులో వెయ్యి కోట్లు పెండింగ్ లో పడిపోయాయి. ఆ తర్వాత అమరావతికి ఎలాంటి సాయం అందలేదు. కానీ ఇప్పుడు ఏకంగా పదిహేను వేల కోట్ల సాయం ప్రకటించారు. 


రూ. 15వేల కోట్లతో మారిపోనున్న అమరావతి రూపురేఖలు


చంద్రబాబు మొదటి సారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అమరావతిని రాజధానిగా ఖరారు చేసి.. భూసమీకరణ చేసి , ఎన్జీటీలో పడిన కేసుల్ని పరిష్కరించుకుని నిర్మాణాలు ప్రారంభించే సరికి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఏడాదిన్నరలోనే వీలైనంత ఎక్కువ ప్రోగ్రెస్ చూపించారు . కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని పక్కన పెట్టేయడంతో పరిస్థితి మారిపోయింది. ఐదేళ్ల పాటు అమరావతి పిచ్చి మొక్కల ప్రాంతంగా మారిపోయింది. కానీ  ప్రభుత్వం మారడం.. కేంద్రం ఏపీ రాజధానికి పదిహేను వేల కోట్ల సాయం  ప్రటించడంతో ఇక నిర్మాణాలు పరుగులు పెట్టనున్నాయి.  ప్రభుత్వ నిర్మాలతో పాటు ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున విద్యా సంస్థలు.. ఏర్పాటు చేయనున్నాయి. అలాగే ప్రముఖ కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నాయి. ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం పెరిగితే ఇక అమరావతి ఐదేళ్లలో ఓ భారీ సిటీగా మారే అవకాశం ఉంది. 


పరిపాలనా నగరం పూర్తికి ఆటంకాలు లేనట్లే !


ప్రభుత్వం ముందు ఇప్పుడు ఉన్న అతి పెద్ద సవాల్ పరిపాలనా నగరం పూర్తి చేయడమే. పరిపాలనా నగరాన్ని పూర్తి చేయడానికి ఇప్పటి వరకూ నిధుల సమస్య ఉంది. కేంద్రం పదిహేను వేల కోట్లు వివిధ సంస్థల ద్వారా సమకూర్చడం ఖాయం కాబట్టి.. వెంటనే పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలతో ఐకానిక్ భవనాల నిర్మాణాలు.. ఉద్యోగులకు వసతి సౌకర్యాలు పూర్తి చేస్తే.. అమరావతి ఓ రూపానికి వస్తుంది. 


ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నం కాదు. స్టాండప్ కామెడీలకు ఏపీ రాజధాని ఓ పాయింట్ కూడా కాదు. ఇప్పుడు అందరికీ ఏపీ రాజధాని అమరావతి అనే స్పష్టత వచ్చేసింది.