ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పార్టీ నేతలతో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, రాష్ట్ర కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు పాల్గోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ భేటీ జరగనుంది.  


గృహసారథుల నియామకం, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రోగ్రెస్‌ను ఈ సమావేశం చర్చిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న గృహసారథుల నియామకం ఇవాళ ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. తుది జాబితాను అంతా కచ్చితంగా పార్టీ అధినేత సమర్పించాలని ఇప్పటికే పార్టీ లీడర్లకు అధినాయకత్వం  ఆదేశాలు జారీ చేసింది. 


కీలకంగా మారిన సమావేశం..


వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తుమన్న జగన్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం జగన్.. త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణయాలకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.


ఇక వరుసగా సమావేశాలే...


ఇప్పటికే పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం జగన్, ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో మీటింగ్‌కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతి సచివాలయ పరిధిలో కన్వీనర్లు, గృహసారథుల నియమాకంపై నిర్ణయించినా ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు.
రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకంపై సీఎం జగన్ గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ దగ్గర సర్వే వివరాలు ఉన్నాయి. ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పనితీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది పార్టీ వర్గాలతో పాటుగా, ఎమ్మెల్యేల్లో హైటెన్షన్ పెరిగిపోతోంది.


సర్వేలు... రిపోర్ట్ లు...


వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులు ఐప్యాక్‌తోపాటుగా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో, పార్టీ కేడర్‌తో మమేకం అవుతున్న విధానంతోపాటుగా వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరుపై ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం లేకపోలేదన్నది పార్టీ నేతల వాదన. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటంతోపాటుగా కొత్తగా ఇంఛార్జ్ లను నియమించే పనిలో ఉంది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను గమనిస్తూ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అనే విధానం అభ్యర్థుల ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు. ఈ వ్యవహారం పై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.


పార్టీ, ప్రభుత్వాన్ని కలిపి ముందుకు... పల్లె నిద్ర


ప్రభుత్వ వ్యవహారాలతోపాటు పార్టీ పనులను సమన్వయం చేసుకుంటూ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం కానున్నారు. ముఖ్యమంత్రి జగన్ పల్లెనిద్ర చేయాలని కీలకంగా నిర్ణయించారని అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రితో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేయబోతున్నారన్నది పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. 


ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు కూడా సిద్దం చేసుకుంటున్నారు. దీని వలన రెబల్స్ లెక్కలు క్లియర్ అవుతాయని పార్టీ భావిస్తోంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత జగన్ ఏం ప్రకటన చేయబోతున్నారనేది మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఈ నెల 20న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా  మా  నమ్మకం నువ్వే జగన్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి నేతలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.