పాఠశాల విద్యాశాఖపై తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల పై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు ఆడిట్‌  నిర్వహించిన అధికారులు, వాటికి సంబంధించిన వివరాలను సీఎంకు అందించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాల్లో ఎదురైన సమస్యలను గుర్తించామని, వాటికి సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు సీఎంకు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెలకు ఒకసారి ఆడిట్‌ చేయాలని సీఎం ఆదేశించారు.


‘‘స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలి. అవ‌సరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలి. స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్‌ను స్కూళ్లలో ప్రదర్శించాలి. ఈ నంబర్‌కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలి’’ అని సీఎం న్నారు. దాంతో 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.


విద్యాకానుకపైనా సీఎం సమీక్ష


వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధంచేసుకున్నామని అధికారులు అన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని సీఎం ఆదేశించారు. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలని సీఎం ఆదేశించారు.


స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలని సీఎం అన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగు నీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని మరోసారి సీఎం ఆదేశించారు. వీటిపై ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలన్నారు. నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  దీంతో పారిశుద్ధ్య లోపం వల్ల, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎం అన్నారు.


భాగస్వామ్యం కానున్న సచివాలయ ఉద్యోగులు


సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసులు సందర్శించాలి. నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించాలి. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్‌ఓపీ తయారు చేశామని అధికారులు తెలిపారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్‌లతో సహా ముగ్గురు సచివాలయ సిబ్బంది అప్‌లోడ్‌ చేయనున్నారు. వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. మండల స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని సీఎం అన్నారు.  


విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సమీక్షించిన సీఎం
5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ ఉంటుంది. తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష చేశారు. అందుకోసం దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనా వేశారు. దశలవారీగా వీటిని తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.512 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్‌ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.


ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ.మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.