ఏపీలో మహిళలు, చిన్నారులకు భద్రత ఇచ్చే ఉద్దేశంతో కొత్తగా 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీటిని బుధవారం (మార్చి 23) అసెంబ్లీ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 1.16 కోట్ల మంది అక్కా చెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అన్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని.. ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్ర వాహనాలున్నాయని అన్నారు. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పటిష్ఠమైన భద్రతను కల్పించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం కోసం విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం పెట్రోలింగ్‌ ను  ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు (స్కూటర్లు) మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. మహిళలు, పిల్లలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పెట్రోలింగ్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం, రక్షణను అందించడమే కాకుండా వారిపైన జరిగే నేరాలను నిరోధించడంలో ఈ పెట్రోలింగ్ వాహనాలు పని చేస్తున్నాయి.


మహిళాల రక్షణ కోసం తీసుకుంటున్న ఈ లక్ష్యాన్ని పెంపొందించే విధంగా, ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలను గుర్తించడంతోపాటు గతంలో జరిగిన నేరానికి సంబందించిన వివరాలు, సమయం, ప్రాంతం వంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేస్తూ, ఆ సమాచారాన్ని దిశ పెట్రోలింగ్ వాహనాలను అనుసంధానించడం జరుగుతుంది.


ఈ గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న  పోలీస్ శాఖ 163 ఫోర్ వీలర్ వాహనాలను కొనుగోలు చేసింది పంపిణీకి సిద్ధం చేసింది. ఈ వాహనాలన్ని  జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక GPS ట్రాకింగ్ వ్యవస్థతో కూడి  ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు జనసంచారం తక్కువ ఉన్న  సమస్యాత్మక ప్రాంతాలలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని  ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.


ప్రస్తుతం ఉన్న 900 ద్విచక్ర వాహనాలు, 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర ప్రతిస్పందన కోసం 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 పోలీస్ యూనిట్లలో ఏర్పాటు చేసిన దిశ కంట్రోల్ రూంతో పాటు పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకి అనుసంధానించారు. దీని ద్వారా మహిళలు తమ మొబైల్ ఫోన్ లో దిశ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా, అనంతరం ఏదైనా సమస్యను ఉత్పన్నమైనప్పుడు తమ చేతిలోని SOS లేదా మొబైల్ ను షేక్ చేయడం ద్వారా బాధితుల వద్దకు పోలీసులు చేరుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిస్పందన సమయం 4-5 నిమిషాలు అదే గ్రామీణ ప్రాంతాల్లో 8-10 నిమిషాలకు తగ్గింది. ఈ ప్రతిస్పందన సమయం మరింత తక్కువగా ఉండడానికి ఈ ప్రత్యేక వాహనాలు తోడ్పడనున్నాయి. ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్‌ను కోటి పదహారు లక్షల మంది మహిళలు తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవడం మన అందరికి తెలిసిందే.


మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా దిశ మొబైల్ విశ్రాంతి గదులు
మహిళా సాధికారతలో భాగంగా పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసు శాఖలో చేరుతున్నారు. వివిధ సందర్భాలలో ప్రముఖుల సమావేశాలు, బందోబస్తులతో తోపాటు ఇతర అనేక  కార్యక్రమాల కోసం మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా వాష్ రూంలు అందుబాటులో లేకపోవడంతో విధులు నిర్వహిస్తున్న ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం, పోలీస్ శాఖ క్షేత్ర స్థాయి విధుల్లో ఉన్న మహిళా పోలీసుల ప్రాథమిక సౌకర్యాల కల్పనలో భాగంగా 30 మొబైల్ రెస్ట్ రూంలను ప్రత్యేకంగా రూపొందించి 18 మొబైల్ రెస్ట్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చింది.


మొబైల్ రెస్ట్ రూం ప్రత్యేకతలు
• మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక రూం, విలువైన వస్తువులను భద్రపరుచుకునేందుకు 9 లాకర్లు, 3 మొబైల్ ఛార్జింగ్ పాయింట్
• 3 ఆధునిక washrooms  
• 1 షవర్ రూం 
• 3 KV ఫిట్టెడ్ పవర్ జనరేటర్
• 1.5 kv ఫిట్టెడ్ ఇన్వర్టర్ 
• External Power Connectivity 
• 800 లీటర్ల మంచి నీటి ట్యాంక్ 
• 800 లీటర్ల మురుగు నీటి ట్యాంక్