అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత మనం గేర్‌ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జులతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు, అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు అని వైఎస్ఆర్ సీపీ నేతలతో అన్నారు.


‘‘ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, వచ్చే ఆరు నెలలు సరిగా పనిచేయకపోయినా పర్వాలేదు అనే భావన సరికాదు. వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు పడాలి. ఇంతకముందు నేను చెప్పాను. 175 కి 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు?   వైనాట్‌ 175. ఇది సాధ్యమే. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, ఇది సాధ్యం. క్షేత్రస్ధాయిలో మనం అంత బలంగా ఉన్నాం కాబట్టే.. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీచేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి.


గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందనను మీరంతా కళ్లారా చూశారు. ప్రతి ఇంటికీ మీరు వెళ్లినప్పుడు, మీరు ఇచ్చిన లేఖను ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చినప్పుడు వాళ్లలో వచ్చిన స్పందనను మీరు చూశారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే మందు చూపు, ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి. అందుకనే ఇంతకు ముందు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఆరునెలల్లో మనం చేయబోయేది మరొక ఎత్తు. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ, వారితో మమేకమై ఉండడం ఒక ముఖ్యమైన విషయం కాగా, ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయం. వీటికి సంబంధించిన ప్రతి అడుగు రాబోయే రోజుల్లో వేయాలి. 


రాబోయే రోజుల్లో ఇంకా పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ప్రతి నియోజకర్గంలో విభేదాలు లేకుండా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. గ్రామ, మండల స్ధాయిలో ఉన్న నాయకులకు ఎలాంటి విభేదాలున్నా.. వాటిన్నింటినీ పరిష్కరించుకుని, వారిని సరిదిద్దుకుని అడుగులు వేయించాలి. వచ్చే 6 నెలల్లో వీటిపై దృష్టి పెట్టాలి.


మరో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే. చాలామందికి తిరిగి టిక్కెట్లు రావొచ్చు, కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరు ఉన్న పరిస్థితులను బట్టి, మనం తీసుకున్న అడుగులు బట్టి, ఏది కరెక్ట్, ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అందరికీ చెప్పేది ఒక్కటే... టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అని అనుకోవద్దు. టిక్కట్‌ ఇస్తే అది ఒక బాధ్యత. టిక్కెట్‌ రాకపోయినా మీరు నా వాళ్లు కాకుండా పోరు. టిక్కెట్‌ వచ్చినా, రాకున్నా మీరు ఎప్పటికీ నా వాళ్లు గానే ఉంటారు. అది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి.


ఇంతకముందే చెప్పాను. జుట్టు ఉంటే.. ముడేసుకోవచ్చు. కచ్చితంగా టిక్కెట్లు ఇచ్చే విషయంలో నేను తీసుకొబోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమం జరగాలి. టిక్కెట్లు ఇవ్వని పక్షంలో మరొకటి ఇస్తాం. లీడర్‌ మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు అడుగులు కరెక్ట్‌గా పడతాయి. 


తుది దశకు సర్వేలు
సర్వేలు కూడా దాదాపు తుది దశలోకి వస్తున్నాయి. చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయి. రానున్న రెండు నెలలు అందరూ ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు మీ పట్ల వస్తాయి. అందుకనే ప్రజల్లో మమేకమై ఉండండి. వచ్చే 2 నెలలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలను మీకు తెలియజేస్తున్నాను. రెండు మేజర్‌ కార్యక్రమాలు చేపడుతున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, అలాగే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని పార్టీ నుంచి చేపడుతున్నాం. వచ్చే 2 నెలల్లో ఈ రెండు కార్యక్రమాలు చేయబోతున్నాం. గతంలో మనం చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం  చాలా పాజిటివ్‌ నిచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. లబ్ధిదారులందరినీ జల్లెడ పట్టి.. వారిందరికీ సహాయ, సహకారాలు అందిస్తూ మంచి చేయగలిగాం. అర్హులైనవారికి అవసరమైన ధృవపత్రాలను జారీచేశాం.


దీనిలాగే ఆరోగ్య సురక్ష చేపడుతున్నాం. ఆరోగ్య పరంగా ప్రతి ఇంటినీ జల్లెడపడతాం. ప్రతి ఇంట్లోనూ ఉచితంగా ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తాం. గుర్తించిన వారికి చేయూతనిచ్చి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. నయం అయ్యేంతవరకూ విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌తో వారికి చేయూతనిస్తాం. ఇది కూడా మరొక విప్లవాత్మకమైన కార్యక్రమం. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం.


5 దశల్లో జగనన్న సురక్ష
మొత్తం 5 దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుంది. మొదటి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు. రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ పరీక్షలు చేయడానికి వెళ్తారు. ఆరోగ్యశ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా అవగాహన కల్పిస్తారు. మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు, తేదీ, వివరాలు తెలియజేస్తారు. క్యాంపు కన్నా మూడు రోజులు ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది.


నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూత ఇస్తారు. ఇప్పటికే కార్యక్రమం మొదలయ్యింది. పూర్తిస్థాయి అవగాహనకోసం ఈ వర్క్‌షాపు ఏర్పాటు చేశాం. ఈ రెండు కార్యక్రమాల్లో కేడర్‌ను, గ్రామస్ధాయిలో ప్రజా ప్రతినిధులను, వాలంటీర్లను ఇన్‌వాల్వ్‌ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలి. అలాగే నవంబర్‌ చివరి నాటికి గడప గడపకూ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో మమేకం కావాల్సి ఉంటుంది. ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అన్న కార్యక్రమంలో నాలుగేళ్లకు పైగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చాలా స్పష్టంగా చూపిస్తాం’’ అని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.