e Cabinet Meetings in AP: కాగిత రహిత సమావేశాలకు ఏపీ కేబినెట్ సన్నద్ధమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై సీఎం చంద్రబాబు ఎంత ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో, మంత్రులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గతంలో చంద్రబాబు కాగిత రహిత ఇ-కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడా విధానాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై జరిగే కేబినెట్ సమావేశాలన్నీ కాగిత రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు. 


చంద్రబాబు తొలుత 2014లో ఇ-కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కనబెట్టింది. కాగా, కేబినెట్ సమావేశం అంటే చాలు... ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కాగిత రహిత ఇ-కేబినెట్ సమావేశాల్లో ఆ పరిస్థితి కనిపించదు. ఎంచక్కా, మంత్రుల ఐ ప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలన్నీ అప్ లోడ్ చేస్తారు. 


ఈ విధమైన హైటెక్ కేబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా, కేబినెట్ నోట్స్ బయటికి లీక్ కాకుండా ఇ-కేబినెట్ విధానం ఉపకరించనుంది.