సీఎం జగన్ పారిస్‌ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కుమార్తె కాలేజీ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతికి సీఎం జగన్ రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. జగన్‌ అభ్యర్థనపై అభ్యంతరం చెప్పింది. పారిస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు తెలియజేశారు సీబీఐ అధికారులు. వివిధ కారణాలు చెప్పి జగన్‌ విదేశాలకు వెళ్తున్నారని ఇది విచారణపై ప్రభావం పడుతుందని వివరించింది. జగన్ పారిస్‌ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది సీబీఐ.


కోర్టు అనుమతితో ఇటీవలే దావోస్ టూర్‌కు వెళ్లివచ్చిన సీఎం జగన్... మరోసారి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న జగన్... వారం రోజులపాటు దావోస్‌లో వ్యక్తిగత పర్యటన చేశారు. మరోసారి పారిస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈసారి పూర్తిగా వ్యక్తిగత పర్యటన. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్‌ స్కూల్‌లో సీఎం జగన్ పెద్దకుమార్తె హర్షా రెడ్డి చదువుతున్నారు. 


లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్‌లో మాస్టర్స్ చదువుతున్నారు హర్షారెడ్డి. గ్రాడ్యూయేషన్ సెర్మనీ ఉండటంతో ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి.. ఆ వేడుకల్లో పాల్గొనడానికి పారిస్ వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో కుటుంబ పర్యటనలో వారిద్దరూ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 


ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తెతో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు జగన్ కుమార్తె ప్రసిద్ధ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 


సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.