ఏపీ ప్రభుత్వంపై సర్పంచ్‌ల సంఘం పోరు మొదలు పెట్టింది. నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు సర్పంచ్‌లు. 


రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులు దొంగిలించడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సర్పంచుల సంఘం, పంచాయితీ రాజ్ ఛాంబర్ నిర్ణయించాయి. ఈ మేరకు ఆగష్టు రెండో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచ్‌లను కూడా కలుపుకొని కార్యక్రమం చేపడతారు. 100 మంది వరకు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.


డిమాండ్లు ఇవే... 
చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను, ఆర్థిక శాఖ,  గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులతోపాటు ఇతర పెద్దలను, అధికారులను కలవబోతున్నారు. కలిసిన తర్వాత రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల, పంచాయతీల, సర్పంచుల దుస్థితిపై మెమోరాండం సమర్పించనున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ.8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా, దొంగిలించి, దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వినియోగించుకుందని అంటున్నారు.  2022-23 ఆర్థిక సంవత్సరంలో 2010 కోట్లు, 2023 -24 లో  2035 కోట్లు, మొత్తం రూ.4045 కోట్లు ఇంకా పంచాయతీలకు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయాలన్నింటిని కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 


పంచాయితీ నిధులు పథకాలకు...
ఉపాధి హామీ చట్టం క్రింద వచ్చే నిధులు చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను హైజాక్ చేసి తన సొంత అవసరాలకు, పథకాలకు కట్టబెట్టుకుంటుందని అంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలను, సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, వార్డు మెంబర్లను డమ్మీలుగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి అధికారాలను రాజ్యాంగేతర శక్తులుగా మారిన వాలంటీర్లకు కట్టబెట్టారని విమర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జప్పీటీసీలకు , వార్డు మెంబర్లకు సమాంతరమైన పోటీ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీని వలన సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని అంటున్నారు. 


రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 12918 మంది గ్రామ సర్పంచులు కనీసం తాగునీరు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని,"జల జీవన్ మిషన్" పథకాన్ని మూలన పడేశారని అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా మా గ్రామపంచాయతీ పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే జమ చేయాలని, కేంద్రాన్ని కోరతామన్నారు.


సీబీఐతో విచారణ ...
 రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన రూ 8660 కోట్ల నిధులపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి, సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.  రాజ్యాంగేతర వ్యవస్థలైన "గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను" రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీల్లో విలీనం చేయాలని, నరేగా నిధులు కూడా నేరుగా గ్రామపంచాయతీలకే పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో జమ చేయాలనే డిమాండ్లను లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వినిపించనున్నారు.