APCC News: ఏపీలో రైతులకు విత్తనాలు సరఫరా చేయడంలో జాప్యం చేయడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు వచ్చిందని సంతోష పడేలోపే.. విత్తనాలను అందుబాటులో ఉంచకుండా రైతులను ఉసూరుమనిపించారని అన్నారు. క్రాప్ హాలిడే నుంచి బీడు భూములను సాగులోకి తెద్దామనే రైతు ఆశను మళ్లీ చంపుతున్నారని విమర్శించారు. షర్మిల గురువారం ట్వీట్ చేశారు.


‘‘సాగర్ కుడికాలువ ఆయకట్టు కింద సాగునీరు వచ్చిందని సంతోష పడేలోపే వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం 4 లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారింది. డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచడంలో కూటమి సర్కార్ విఫలమయ్యిందని చెప్పాలి. రైతుల ఆశలను పూర్తిగా అవిరి చేస్తున్నారు. క్రాప్ హాలిడే నుంచి బీడు భూములను సాగులోకి తెద్దామనే రైతు ఆశను మళ్లీ చంపుతున్నారు. పోలీసులను కాపలా పెట్టి టోకెన్లు ఇవ్వడం ఏంటి? పదో పరకో ఇచ్చి కౌంటర్లు మూయడం ఏంటి? రైతులు అడిగింది కాకుండా సర్కారుకు నచ్చిన విత్తన రకం కొనాలని ఒత్తిడి చేయడం ఏంటి? మహిళలు అని చూడకుండా విత్తనాల కోసం వర్షంలో నిలబెడతారా? 


తొక్కిసలాట జరుగుతుంటే చోద్యం చూస్తారా? రైతు పక్షపాతి అని చెప్పుకొనే కూటమి సర్కారుకి ఇది తగునా? 10 రోజులుగా కాళ్లు అరిగేలా రైతులు విత్తన కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కనపడటం లేదా? వెంటనే 48 గంటల్లో JGL - 384 రకం విత్తనాలు 15 వేల క్వింటాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. ఈ విత్తనాన్ని సైతం రాయితీ జాబితాలో చేర్చాలి. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాం’’ అని షర్మిల అన్నారు.