Minister Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు చేసే వ్యాఖ్యలు ప్రజలను కాటు వేసేలా ఉన్నాయని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకుంటూ ప్రజలను ఓట్లు అడగడం సహజమని... కానీ ఆయన అలాంటిదేమీ లేకుండా ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. అలాగే ఆయన మాట్లాడే మాటలన్నీ ప్రజల్ని కాటు వేసేలా ఉన్నాయన్నారు. ఆయన కావాలనే సినిమా స్టైల్ లో జనం ముందు నాటకాలు వేస్తున్నారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. 86 నియోజక వర్గాల్లో టీడీపీకి దిక్కేలేదని సొంత సర్వేలోనే తేలిందని విమర్శించారు. గతంలో ఏవైనా మంచి పనులు చేస్తే జనం గుర్తుపెట్టుకునే వారని.. కానీ మంచి పనులు చేయనుందునే ఆయనను గద్దె దింపారని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందన్నారు. 


82 వేల మంది బీసీలను లీడర్లుగా మార్చిన ఘనత జగన్ దే.. 
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎన్ని డ్రామాలైనా చేస్తాడని మంత్రి జోగి రమేష్ అన్నారు. బీసీల్లో 82 వేల మందిని జగన్ లీడర్లుగా తయారు చేశారని చెప్పారు. జయహో బీసీ, జయహో జగనన్న అనే నినాదం రాష్ట్రమంతా మార్మోగుతోందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇష్టానుసారంగా ట్వీట్లు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు భద్రతలో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే దాని మీద కూడా విమర్శలు చేయటం లోకేష్ కే చెల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి చంద్రబాబు, లోకేష్ అలవాటు పడ్డారంటూ ఫైర్ అయ్యారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేష్ పాత్ర కూడా ఉందని వివరించారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. అందరి తప్పులూ బయటకు వస్తాయని.. వారిద్దరు కూడా జైలుకి పోవటం ఖాయం అని కామెంట్లు చేశారు. 


దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అంత మంచిగా పనులు జరుగుతుంటే, ఎందుకంత కడుపు మంటని ప్రశ్నించారు. గుంకలాంలో 10 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే, ఏ పనులూ జరగడం లేదని పవన్ అనటం, ఆయనకు కళ్లున్నాయా అనే అనుమానం కలుగుతుందన్నారు. పనులు ఏమీ జరగనట్లు గెస్ట్‌ ఆర్టిస్ట్‌ కలరింగ్‌ ఇస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయని, ఆనాడు మీరిచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారో తెలుసుకోవాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ మూడు సెంట్లలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారని, మీ ఉమ్మడి ప్రభుత్వంలో కనీసం ఒక్కటంటే ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చారా అని ప్రశ్నించారు.


ఆ ఇద్దరిదీ రాక్షస క్రీడ..


పవన్‌ కల్యాణ్, ఆయన దత్త తండ్రిది రాక్షస క్రీడ అని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇద్దరూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడుతున్నారని.. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు కానీ, పవన్‌ కల్యాణ్‌ కానీ.. ఏ లేఅవుట్‌కు అయినా రండి. అన్నీ చూపిస్తాం అని సవాల్ విసిరారు. అయినా దొడ్డిదారిన వెళ్తూ, లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పీకేస్తాం.. లాగేస్తాం.. అన్న మీ మాటలు.. సినిమాల్లోనే చెల్లుతాయి కానీ, రాజకీయాల్లో కాదన్నారు. 2024 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌తో పాటు, చంద్రబాబు కూడా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.