AP minister Gottipati Ravikumar responds over Kanigiri Electric shock incident - అమరావతి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి చెందడం పట్ల ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యువకులు చనిపోవడం తనను కలిచివేసిందన్నారు. విద్యుత్ షాక్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకి రాష్ర్ట ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం చెల్లిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.


రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస విద్యుత్ ప్రమాదాలపై గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల ముందస్తు నివారణ చర్యల్లో  భాగంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిoచాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. చనిపోయిన వారికి  రూ.5లక్షల పరిహారం ఇవ్వటం ముఖ్యం కాదని.. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పారు. విధుల్లో విద్యుత్ సిబ్బంది అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించబోనని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలకు వెనకాడబోమని గొట్టిపాటి రవి హెచ్చరించారు.


ప్రాణం ఎంతో విలువైనదిగా భావిస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కనిగిరి విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తోనూ ఆయన్ మాట్లాడారు. ఘటనలో యువకులు చనిపోవడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.