పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోట ఇకో టూరిజం పార్కు సహా ఇతర అభివృద్ధి పనులపై శుక్రవారం (అక్టోబరు 13) విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన సంబంధిత శాఖల  అధికారులతో సమీక్షించారు.


13, 14వ శతాబ్దాలకు చెందిన ఈ కొండవీడు కోటను దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే రీతిలో పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ చేపట్టిన అప్రోచ్ రోడ్డులు సహా ఇతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆర్కియాలజీ, దేవాదాయ, అటవీ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. అదే విధంగా పర్యాటకులకు కనీస వసతులైన తాగునీరు, మరుగు దొడ్లు వంటి వస్తువులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎస్ ఆదేశించారు.


దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష్మి నర్సింహ స్వామి దేవాలయం ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శివాలయం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


సాయంత్రం వేళల్లో సందర్శకులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో కోట ఆవరణలో సౌండ్ అండ్ లైటింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా కోట చుట్టూ లోపల వెలుపల పెద్ద ఎత్తున సుందరీకరణ తోపాటు వెలుపల పార్కులు, ల్యాండ్ స్కేపింగ్ వంటివి అభివృద్ధి చేయాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


ఈసమావేశంలో పీసీసీఎఫ్ వై.మదుసూధన్ రెడ్డి, ఆర్కియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్,రాష్ట్ర పర్యాటక శాఖ ఎండి కె.కన్నబాబు,దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్య నారాయణ,ఆర్ అండ్బి ఈఎన్సీ నయీముల్లా, సీఈ శివారెడ్డి, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస రెడ్డి,కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి,డిఎఫ్ఓ రామచంద్ర రావు పాల్గొన్నారు.వీడియో లింక్ ద్వారా ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆర్ అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.