వైయస్సార్‌ యంత్రసేవా పథకం కింద కిసాన్‌ డ్రోన్లు పంపిణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయ్యింది. జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
వ్యవసాయం, మార్కెటింగ్ పై సీఎం సమీక్ష..
తాడేపల్లిలో ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల పై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రబీలో ఇ– క్రాప్‌ బుకింగ్‌ పై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. 48.02 లక్షల ఎకరాల్లో ఇ–క్రాప్‌ బుకింగ్‌ పూర్తయిందని ,97.5 శాతం ఇ – క్రాపింగ్‌ పూర్తి చేశామని, ఇ– క్రాపింగ్‌ చేసుకున్న రైతులందరికీ కూడా డిజిటల్‌ రశీదులు, భౌతికంగా రశీదులు ఇచ్చామని అదికారులు సీఎంకు వివరించారు. ఈ డేటాను సివిల్‌ సఫ్లైస్‌ డిపార్ట్‌మెంటుకు, మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంటుకు పంపించామని వెల్లడించిన అధికారులు,సీఎం కు పూర్తి స్థాయి నివేదికను అందించారు.
కమ్యూనిటి హైరింగ్ సెంటర్లు...
రాష్ట్ర వ్యాప్తంగా 3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు (సీహెచ్‌సీ)లకూ, 194  క్లస్టర్‌ స్ధాయి సీహెచ్‌సీలకూ మే 20లోగా వైయస్సార్‌ యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే గతంలో సుమారు 6,500 ఆర్బీకేల పరిధిలోని సీహెచ్‌సీలకు వ్యవసాయ ఉపకరణాలను అందించామని వెల్లడించిన అధికారులు, ఆర్బీకే స్ధాయి సీహెచ్‌సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్‌ స్ధాయి సీహెచ్‌సీలకు రూ. 25 లక్షల విలువైన యంత్రాలు ఉంచుతున్నట్టు వెల్లడించారు.
కిసాన్ డ్రోన్లు రెడీ...
వైయస్సార్‌ యంత్రసేవా పథకం కింద కిసాన్‌ డ్రోన్లు 
జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. డిసెంబర్‌ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాల నిర్వాహణ, తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీ చర్యలకు ఉపక్రమిస్తోంది. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని విజయనగరంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
రైతు భరోసాకు రెడీ అవ్వండి... సీఎం
ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వైయస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలన్న, అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శినకు ఉంచాలన్నారు. 467 వీఏఏ, 1644 వీహెచ్‌ఏ, 23 వీఎస్‌ఏ, 64 వీఎఫ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, 4656 ఏనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ కూడా అవసరం అయిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఖరీఫ్‌ సీజనల్లో రైతుల దగ్గరనుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తయిందని, రూ.7233 కోట్లకు గానూ రూ.7200 కోట్లు రూపాయలను సర్కార్ చెల్లించిందని, ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా  రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ డబ్బును కూడా వెంటనే చెల్లించాలన్న సీఎం... రైతులకు ఇస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల పేమెంట్లు కూడా పూర్తి చేయాలని సూచించారు. రబీ ప్రొక్యూర్‌మెంట్‌కు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని తెలిపిన అధికారులు, ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని, విదేశాల్లో డిమాండ్‌ ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.