Andhra Pradesh CM Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా ప్రజాప్రతినిధులను ఇంటింటికీ వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెళ్లి ఏడాదిలో అమలు చేసిన పథకాలు వివరించాలని సూచించారు. దీనిపై టీడీపీ నేతలకు ట్రైనింగ్‌ ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. అందు కోసం టీడీపీ ప్రజాప్రతినిధులతో వర్క్‌షాప్ చేపట్టారు. ఇందులో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఎన్నికల్లో పార్టీలో మార్పులు చేశామని అన్నారు చంద్రబాబు. సోషల్ ఇంజినీరింగ్ చేసి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చామని తెలిపారు. అందుకే ఈ దఫా ఎక్కువ మంది కొత్తవాళ్లు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వారు మళ్లీ మళ్లీ గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలా మళ్లీ మళ్లీ గెలిచేందుకు ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తెచ్చుకునేలా ప్రయత్నించాలని సూచించారు చంద్రబాబు.  

నిత్యం ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎవరు ఎలా పని చేస్తున్నారో గతం కంటే ఈసారి క్లియర్ కట్‌గా సమాచారం వస్తోందని తెలిపారు. ఆ రిపోర్టులను ఎమ్మెల్యే చేసిన తప్పులు మంచి పనులు తన వద్ద ఉన్నాయని వివరించారు. వాటిని ఆధారంగా ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నానని వివరించారు. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించినట్టు చంద్రబాబు ప్రకటించారు. నలుగురితో మొదలు పెట్టానని కచ్చితంగా రోజుకు నలుగురితో మాట్లాడతానని తెలిపారు.

గతంలో టీడీపీ ఓడిపోవడానికి చేసిన పని చెప్పలేకపోవడమే కారణం అన్నారు. అందుకే చేసిన పనులు చెప్పుకోవడానికి నేతలు మొహమాట పడొద్దని సూచించారు. ఇకపై తాను కూడా మొహమాట పడే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. తప్పులు చేసినవారికి ఒకటికి పదిసార్లు చెబుతానని అన్నారు అప్పటికీ మారకుంటే నమస్కారం పెట్టేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం అంటూ రాజకీయాలు మర్చిపోతున్నామని ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూడాలని హితవు పలికారు. 

ప్రజల్లో నిత్యం ఉంటూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలన్నారు చంద్రబాబు. ప్రభుత్వం, నేతలు చేసిన పనులు ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటే సరి చేసుకోవాలని హితవుపలికారు. రాష్ట్రఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ పూర్తి చేశామని చెప్పడం లేదని కానీ ప్రజలకు అవసరమైనవి అమలు చేశామని తెలిపారు. ఇంకా అమలు చేయాల్సిన ఉన్నాయని వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నామో ప్రజలకు వివరించాలని తెలిపారు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అనే కాన్సెప్టు తీసుకొచ్చామని వెల్లడించారు.  

నాలుగేళ్లు రాజకీయాలు మర్చిపోయి రాష్ట్రం కోసం కష్టపడి ఆఖరి ఏడాది ఎన్నికల గురించి ఆలోచిస్తే మంచి ఫలితాలు రావని అన్నారు చంద్రబాబు. అందుకే ఈసారి మొదటి ఏడాది నుంచే చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యచరణ చేపట్టినట్టు వెల్లడించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఎలా అడుగులు పడ్డాయో ప్రజలతు వివరించాలని చెప్పాలన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా భయపడకుండా ఒక్కో సమస్యను పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు.  

ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయలేదని ఇకపై కూడా చేయబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులు కేంద్రానికి వివరించి నిధులు సాధించుకుంటున్నామని అన్నారు. కేంద్రం సహకరించుకుంటే ఏపీ ఎప్పుడో దివాళా తీసి ఉండని అన్నారు. కేంద్రం అందించిన సాయంతోనే ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అన్నింటినీ ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. 

ఎవరు ప్రజల్లో ఉంటున్నారు? ఎవరు పని చేయకుండా ఉంటున్నారో తనకు తెలుస్తోందని వివరించారు చంద్రబాబు. తక్కువ కష్టపడి ఎక్కువ పేరు తెచ్చకున్న వాళ్లు ఉన్నారని, ఎక్కువ పని చేసినా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు అదే స్థాయిలో తెచ్చిన వాళ్లు ఉన్నారని అన్నారు. కొందరు చేసిన పనిని చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. సిన్సియర్‌గా పని చేసే వాళ్లకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. వారసత్వం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం శుభం అనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రన్న ఫ్యామిలీ సిన్సియర్‌గా ఉన్నందున రామ్మోహన్ కేంద్రమంత్రి అయ్యాడని గుర్తు చేశారు. బాలయోగి చనిపోయినప్పుడు హరీష్ చిన్నవాడని ఆయన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి ఎంపీగా చేశామని గుర్తు చేశారు. సిన్సియర్‌గా పని చేసే వాళ్లను గౌరవిస్తాం, గుర్తిస్తాం, న్యాయం చేస్తామని అన్నారు.