Andhra Pradesh News | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)తో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్ భేటీ ముగిసింది. రాష్ట్రంలోని వివిధ అంశాలపై భేటీలో చంద్రబాబు, పీయూష్ గోయల్ మధ్య చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. పొగాకు ధరలు తగ్గినా రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. 

కేంద్ర మంత్రిని చంద్రబాబు ఏం కోరారంటే..

‘బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు(Tobacco) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసే రూ. 300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలి. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలి. ఆయిల్ పాం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలి. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదు. తీవ్రంగా నష్టపోతారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని’ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను చంద్రబాబు కోరారు.

ట్రంప్ సుంకాలతో ఆక్వా రైతులపై ప్రభావం

సీఫుడ్ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావం చూపుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని వినతి. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని పీయూష్ గోయల్ ని కోరారు. ఈ విషయాన్ని ఇదివరకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు వివరించారు.

గుంటూరు పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ సంస్థ పై అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.