సున్నా ప్లస్, సున్నాకలిస్తే ఏమవుతుందో...జనసేన టీడీపీ కలిస్తే కూడా సున్నానే వస్తుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. రెండు అంకెలు కలిస్తే కొత్త అంకె వస్తుందని, రెండు సున్నాలు కలిస్తే సున్నానే వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా నైతిక విలువలు లేవని విమర్శించారు.  టీడీపీ, జనసేన పొత్తును  జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని, చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని అన్నారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన కలిసి రావాలనే తాము కోరుకున్నామని, కలిసి కట్టుగా వారిని ఎన్నికల్లో ఓడించి పంపిస్తామన్నారు. పవన్ ప్రజల్ని కాకుండా పార్టీ నాయకుల్ని, క్యాడర్ ను మోసం చేశారని విమర్శించారు. 


చంద్రబాబు, పవన్ కలిసి వస్తేనే తమకు కూడా మంచిదని అంబటి విశ్లేషించారు. కలవాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నానంటూ పవన్ కేడర్ ను మోసం చేసారని వివరించారు. చంద్రబాబు అరెస్ట్ పైన ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ ఎక్కువ బాధ పడుతున్నారని అన్నారు. పవన్ ను నమ్ముకున్న వాళ్లు ఆలోచన చేయాలని అంబటి సూచించారు. పరామర్శకు వెళ్లి పొత్తు ప్రకటన చేసారని, రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్ అన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ సమావేశానికి వెళ్లిన పవన్..టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందు ఎన్డీఏను సంప్రదించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. 


చంద్రబాబును జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్ కల్యాణ్, నాడు ముద్రగడ ను అరెస్ట్ చేసినా, మ్యాన్ హ్యాండిలింగ్ చేసినా కనీసం ఖండించలేదన్నారు అంబటి రాంబాబు.  మల్టిపుల్ పర్సనాల్టీ డిజాస్టర్ తో పవన్ కల్యాణ్ బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు.  అభిమానులు పవన్ ను సీఎం కావాలని కోరుకుంటుంటే... జనసేనాని మంత్రం ఎన్ని సీట్లు ఇస్తారంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేసారు. సత్తా లేనప్పుడు ఇలాంటి మాటలే వస్తాయని, మనోహర్ ను నమ్ముకొని వెళ్లే, సముద్రంలోకే వెళ్తారంటూ అంబటి విమర్శించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని వ్యక్తిగా అంబటి విశ్లేషించారు.



 సీఎం జగన్ కు భయం పరిచయం చేస్తానని చెలరేగిన లోకేశ్ పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం అందరికి తెలుసన్నారు రాంబాబు. చంద్రబాబు సైతం తనను వైఎస్సార్ ఏం చేయలేకపోయారని, జగన్ ఈ నాలుగు న్నారేళ్లల్లో ఏం చేసారంటూ మాట్లాడారని గుర్తు చేసారు. చంద్రబాబు, లోకేశ్ కు భగవంతుడు సరైన రీతిలో సమాధానం చెప్పాడని, పవన్ కు కూడా బుద్ది వచ్చేలా చెస్తాడని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి వచ్చిందనే లెక్కలపైన అంబటి స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి సానుభూతి ఇచ్చే అంత తెలివి తక్కువ వాళ్లమా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా..లేకున్నా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేసారు. చంద్రబాబు కు సానుభూతి అనేది రాలేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కొందరు చంద్రబాబును సమర్ధిస్తున్నార ని, వారికి త్వరలో అసలు విషయం తెలుస్తుందన్నారు.