Andhra Pradesh Housing Scheme 2025:ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం   రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలు, ప్రగతిలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశారని తెలిపారు.

వచ్చే నెలలో గృహప్రవేశాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2.81 లక్షల గృహాలను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు మంత్రి పార్థసారథి. వచ్చే నెల 15 కల్లా 3.00 లక్షల గృహాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. వీటితో పాటు పి.ఎం.ఏ.వై.-2లో భాగంగా  అర్బన్‌లో మంజూరైన 40 వేల గృహాలకు మంజూరు ఉత్తర్వులు అందజేస్తారు. మరో  2.00 లక్షల గృహాలు అంటే గృహా నిర్మాణ శాఖకు చెందిన మరో లక్ష ఇళ్లు, మరో లక్ష టిడ్కో గృహాలను సంక్రాతికల్లా అందజేస్తారు. ఇవి కాక పి.ఎం.ఏ.వై.-1.0లో ఉన్న మరో 5 లక్షల గృహా నిర్మాణాలను రెండో సంవత్సరం పూర్తయ్యేలోపు పూర్తి చేయాలనే నిర్ణయించారు. ఈ విధంగా రెండేళ్ల కాలంలో దాదాపు 9.00 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. 

ఇంకా ఇల్లు లేని పేదలపై సర్వే

పి.ఎం.ఏ.వై.-2.0 నిబంధనలను కేంద్రం సవరించడం వల్ల ఇకపై కేవలం  అర్బన్ (యు.ఎల్.బి.)ప్రాంతాల్లోనే ఈ పథకం కింద గృహాలను మంజూరు చేస్తామన్నారు. అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రూరల్ పథకం క్రింద గృహాలను మంజూరు చేస్తారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు ఇంకా ఎన్ని గృహాలను నిర్మించాలనే అంశంపై గృహా నిర్మాణ శాఖ సర్వే చేస్తే దాదాపు 6.00 లక్షల గృహాలు అవసరమనే విషయాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. అయితే ఆర్.టి.జి.ఎస్. అంచనాలను కూడా పరిగణలోకి తీసుకుని కచ్చితంగా ఎన్ని గృహాలు నిర్మించాలనే విషయాన్ని అంచనావేసి రూరల్ హౌసింగ్ పథకం కింద గృహాలను నిర్మించాలని ముఖ్యమంత్రి  అదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలం ఇచ్చే అంశంపై రెవెన్యూ శాఖ అధికారులతో కలసి సర్వే చేయనున్నామన్నారు. 

గత ప్రభుత్వ బకాయిలు చెల్లింపు

ఎన్.టి.ఆర్.హౌసింగ్ పథకం కింద గత ప్రభుత్వం ఎటు వంటి బకాయిలు చెల్లించలేదని, వాటిని ఇప్పుడు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం అనుసరించిన అవకతవకల ఆర్థిక విధానాల వల్ల  దాదాపు రూ.3,000 కోట్ల కేంద్ర నిధులను  డైవర్టు అయ్యాయని, అందులో దాదాపు రూ.900 కోట్లను ఇప్పటికే తమ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. హౌసింగ్ లేఅవుట్లలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పథకం కింద మౌలిక వసతుల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. 

పి.ఎం.ఏ.వై.రూరల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుందని, తద్వారా కేంద్రం నుంచి రూ.350 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో రాక్రీట్ సంస్థపై విజిలెన్సు నివేదిక ప్రభుత్వానికి అందిందని, ఆ నివేదిక ఆధారంగా ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఆ సంస్థలు వదిలేసి పోయిన  దాదాపు 80 వేల గృహాలను కేంద్ర, రాష్ట్ర నిధులు దాదాపు రూ.800 కోట్లతో పూర్తి చేస్తామన్నారు.  

 డిసెంబర్‌ కల్లా మరో లక్ష టిడ్కో గృహా నిర్మాణాలు పూర్తి 

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ" డిసెంబర్‌ నాటికి మరో లక్ష టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టిడ్కో ప్రాజెక్టు కింద దాదాపు 83,072 ఇళ్లు పూర్తి చేశాం, అయితే వీటిలో 2014-19 మధ్య కాలంలోనే దాదాపు 75 వేల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలినవి వచ్చే ఏడాది మార్చి 31 కల్లా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం టిడ్కో గృహాలను 2.61 లక్షలకు కుదించిందని, వాటిని ముందుగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ టిడ్కో ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు రూ.6,500 కోట్ల మేర నిధులు కావాల్సి ఉంది." అని తెలిపారు.  

2014-19 మధ్య కాలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా  టిడ్కో గృహ నిర్మాణాలను చేపట్టామన్నారు మంత్రి. "మూడు కేటగిరిల్లో  దాదాపు 7.00 లక్షల గృహాలు నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం. వాటిలో 5.00 లక్షల గృహాలకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకున్నాం. వాటిలో 4.54 లక్షల గృహాలకు  టెండర్లు పిలిచాం, 3.13 లక్షల గృహాలు గ్రౌండ్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం ఆ గృహా నిర్మాణాలు పూర్తిగా నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం టిడ్కో గృహాలపై  రుణాలు  తీసుకుని ఇ.ఎం.ఐ.లు కట్టకపోవడం వల్ల లబ్దిదారులకు నోటీసులు వచ్చాయి. దీనికి ఇప్పటి ప్రభుత్వం రూ.140 కోట్లు ఇ.ఎం.ఐ.రూపేణా కట్టాల్సి వచ్చింది. గత ప్రభుత్వం దాదాపు రూ.4,282 కోట్లు బకాయిలను కాంట్రాక్టర్లకు చెల్లించింది." అని తెలిపారు.