Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భారీ పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు ఆ దిశగానే చర్యలు చేపట్టాలని సూచించారు.
91 సంస్థలు 91,839 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు లోకేష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే దాదాపు లక్ష్యా యాభై వేల మంది యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని అన్నారు. అందుకే అధికారులు అందుకు తగ్గ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రముఖ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నందున అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ప్రతి కంపెనీకి ఒక నోడల్ అధికారిని పెట్టాలని అధికారులు సూచించారు. ఇలా చేయడం వల్ల ఆయా సంస్థల కార్యకలాపాలు వేగవంతం అవుతాయని తెలపారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలన్నారు.
వచ్చే ఐదేళ్లలో వివిధ రంగాల్లో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నట్టు వివరించారు. ఈ మేరకు స్పష్టమైన కార్యచరణ ప్రణాలికలను రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల స్థాపనకు మరింత అనువైన వాతావరణం కల్పించాలని అనుమతులు తక్షణం మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు ప్రజలకు అందాల్సిన సేవలపై అలసత్వం వద్దని అధికారులకు సూచించారు. ప్రజలకు అందే సేవలు మరింత సులభంగా చేరేలా ఏర్పాటు చేసిన మన మిత్ర యాప్ పరిధిలోకి మరిన్ని సేవలు తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్ నుంచే దాదాపు అన్ని సేవలు అందుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వాళ్లు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టు తిరిగే ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగించుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం ఈ మన మిత్ర యాప్ ద్వారా 317 సేవలు అందుతున్నాయి. దీన్ని మే చివరి నాటికి 400కు పెంచాలని అధికారులకు నారా లోకేష్ సూచించారు. ప్రస్తుతానికి ఈ యాప్లో రెవెన్యూ శాఖ పరంగా భూరికార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రం, జన్మ ధ్రువీకరణ పత్రం, పంట నష్టం అంచనా వివరాలు, భూ మార్పిడికి సంబంధించిన వివరాలు, ఐ పట్టా పాస్బుక్ల వివరాలు లభిస్తున్నాయి.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సేవలు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల వివరాలు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కోసం దరఖాస్తు, నీటి సరఫరాల, పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులు, గ్రామస్థాయిలో వివిధ పన్నుల చెల్లింపు, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుల, వీధి దీపాల నిర్వహాణకు సంబంధించిన ఫిర్యాదులు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదుల సేవలు లబిస్తాయి.
మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి సేవలు పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను చెల్లింపు, నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులు, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు, వ్యాపార లైసెన్స్ కోసం దరఖాస్తు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులు, వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదుల సేవలు లభిస్తాయి.
విద్య, ఉపాధి శాఖ సేవలకు సంబంధించిన వివరాలు విద్యాసంస్థల గురించి సమాచారం, ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల వివరాలు, ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ పాఠశాలలలు, కళాశాలల వివరాలు ఈ మన మిత్ర వాట్సాప్ యాప్లో లభిస్తాయి.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలు, వైద్య శిబిరాల సమాచారం, టీకాల కార్యక్రమాల వివరాలు, ఆరోగ్య పథకాల గురించి సమాచారం, రక్త నిధి కేంద్రాల వివరాలు లభిస్తాయి.
రవాణా శాఖ సేవలుఆర్టీసీ బస్సుల సమయం, టికెట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన సమాచారం, వాహన పన్ను చెల్లింపుల వివరాలు లభిస్తాయి. వీటితోపాటు పోలీస్ శాఖ ఫిర్యాదులు, విపత్తు నిర్వహణకు సంబంధించిన సమాచారం, సామాజిక సంక్షేమ పథకాల గురించి సమాచారం, వ్యవసాయ శాఖకు సంబంధించిన మసాచారం, విద్యుత్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, చెల్లింపుల వివరాలు ఈ వాట్సాప్ యాప్లో లభిస్తాయి.
ఉండవల్లిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎదురవుతున్న సమస్యలు చర్చించారు. మెరుగుపడేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మన మిత్ర లాంటి యాప్ల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా ఆలోచించారు.