వైసిపీ ప్లీనరీ మొదటి రోజు కోసం ఘుమఘుమలాడే వంటలు రెడీ చేశారు. పాకశాస్త్ర నిపుణులైన వంటవాళ్లే కాక, మంత్రులు, పార్టీ కీలక నేతలు సైతం వంటల వద్ద ఆసక్తిగా ఓ రౌండ్ వేస్తున్నారు. వీలైతే తమ చేతి రుచిని చూపే ప్రయత్నమూ చేశారు. సాక్షాత్తూ ఏపీ హోం మంత్రి తానేటి వనిత ప్లీనరీ వద్ద ఉన్న వంటశాలకు వెళ్లి స్వయంగా గరిటె తిప్పారు. దీంతో అక్కడే ఉన్న పార్టీ నేతలు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వంటి వారు ఆసక్తిగా వంట వద్దకు చేరుకున్నారు. ప్లీనరీకి రావడమే కాకుండా ఇలా వంట పనుల్లోనూ మంత్రులు, నాయకులూ ఓ చెయ్యి వేస్తుండడంతో సభా ప్రాంగణం వద్ద పండుగ లాంటి వాతావరణం నెలకొంది . 

 

తొలిరోజు మెనూ ఇదే :

 

ఇక వైసిపీ ప్లీనరీ తొలిరోజున అతిథులు, కార్యకర్తల కోసం భారీ మెనూ రెడీ అయింది. ఉదయం 11 నుంచి భోజనాలు వడ్డిస్తున్నారు. రెండున్నర లక్షల మందికి సరిపోయేలా మెనూ రెడీ చేసారు. మొత్తం 250 కౌంటర్లను ఏర్పాటు చేసారు. ఇక ఐటమ్స్ ఏంటంటే మటన్  దమ్  బిర్యానీ , చికెన్ రోస్ట్, రొయ్యల కూర, బొమ్మిడాయిల పులుసు, చేపల పులుసు, కోడిగుడ్లు, చపాతీ, బంగాళాదుంప కూర, బ్రెడ్ హల్వా, తాపేశ్వరం కాజా , వెజ్ బిర్యానీ, ఉల్లి చట్నీ, పెరుగుపచ్చడి, వైట్ రైస్, ఆవకాయ, నెయ్యి, మునగకాడ కర్రీ, ఉలవచారు, సాంబారు, రసం, మజ్జిగపులుసు, పెరుగు , వడియాలు/సమోసాలు, ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ .. ఇలా 25 రకాల ఐటమ్స్ తో విందుభోజనాలు రెడీ అవుతున్నాయి.

 

ప్లీనరీకి వచ్చే ప్రతీ ఒక్కరికీ భోజనాలు సంతృప్తిగా అందేలా చర్యలు చేపట్టమంటున్నారు వైసీపీ ప్లీనరీ కోసం ఏర్పాటైన ఫుడ్ కమిటీ నేతలు .  తమ ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం ప్రతిష్టాత్మకం గా జరిపే మహానాడు లోని వంటకాలను మించిపోయేలా ఫుడ్ మెనూ రెడీ చేసారు. మహానాడులో మొదటిరోజు 70 వేలమందికి సరిపోయేలా 19 రకాల వంటకాలతో లంచ్, 11 రకాల వంటలతో డిన్నర్ ఏర్పాటు చేసారు. అయితే ఇప్పడు దాన్ని దాటేలా ఏకంగా రెండున్నర లక్షల మందికి ఒక్క లంచ్ కోసమే 25 రకాల వంటకాలను రెడీ చెయ్యడం చూస్తుంటే వైసిపీ ప్లీనరీ విషయంలో దీనికీ తగ్గేదే లే అన్నట్టుంది ఆ పార్టీ వ్యవహారం అంటున్నారు వైసీపీ శ్రేణులు .