ఛలో అసెంబ్లీకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మహిళ ఎస్సీ నేత కంభంపాటి శిరీష పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. స్థానిక మల్కాపురం వద్ద శిరీషను తాళ్లతో కట్టి మగ పోలీసులు లాగారు. దీంతో పోలీసుల తీరు పట్ల శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, ఛలో అసెంబ్లీ పేరుతో టీడీపీ నేతలు బయట నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమీపంలో ఓ భవనం ఎక్కిన తెలుగుదేశం నేతలు నినాదాలు చేశారు. సీఎం డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ ఆందోళన చేశారు. టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నేతల్ని బలవంతంగా భవనం మీద నుంచి దించి పోలీసులు అరెస్టు చేశారు.


అదే సమయంలో ఇతర టీడీపీ కీలక నేతలు తమ నిరసనను కొనసాగించారు. సంక్షోభంలో సంక్షేమం నినాదంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన చేపట్టారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జాబ్స్ ఎక్కడ జగన్ అంటూ ఇటీవల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సభలో నిలదీశారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. నేడు సంక్షేమ పథకాలు తొలగించడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.


వైసీపీ పాలనతో సంక్షేమ పథకాలు బంద్.. 
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు చేశారని నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత విధించారని.. ఇదేనా రాజన్న రాజ్యం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సి, ఎస్టి, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ నేతలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.


వైసీపీ నేతలు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు ! 
వైసిపి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు. అధికార పార్టీ వైసిపి నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పేదల పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని  తెదేపా శాసనసభ పక్ష ఉపనేత రామా నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, అలాంటి పథకాలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.