ACB Raids: అవినీతి ఆరోపణలు, అనేక ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమాలు బయట పడినట్లు తెలుస్తోంది. ఆకస్మికంగా దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైనే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ ప్రతాప్ కుమార్, సిఐలు, ఎస్సైలు సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై అనేక ఫిర్యాదులు..


నరసరావు పేట మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైనే దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై అనేక ఫిర్యాదులు అందాయని, ఆ సెక్షన్ లోని అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఏసీబీ ఏఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. అందుకే ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 


తనిఖీల్లో అక్రమ కట్టడాల గుర్తింపు..


టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై ప్రధానంగా దృష్టి పెట్టి సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నరసరావు పేట మున్సిపల్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయా నిర్మాణాల కోసం టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. లంచాలకు మరిగిన అధికారులు, ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తూ పోయారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి, అక్రమంగా భవనాలు నిర్మించినప్పటికీ... వాటిని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు ధ్రువీకరించడం వంటివి తనిఖీల్లో గమనించినట్లు ఏసీబీ ఏఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాలు అన్నీ బయట పడతాయని వెల్లడించారు. 


సూళ్లూరుపేటలోనూ ఏసీబీ తనిఖీలు..


తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మున్సిపల్ కార్యాలయంలోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతులు, అక్రమ కట్టడాలు వంటి వాటిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద నోట్ల కట్టలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


లక్షా 90 వేల నగదు స్వాధీనం..


సూళ్లూరుపేట మున్సిపల్  ఆఫీస్ పై ఉమ్మడి నెల్లూరు జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మోహన్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవినీతి జరుగుతోందని పలు ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆ కంప్లైంట్స్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ లోకి అడుగుపెట్టగానే... మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ కిటికీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టలు రెండు దొరికాయి. అలాగే వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి దొరికాయి. అనంతరం కమిషనర్ కారులో తనిఖీ చేయగా రూ. 50 వేలు లభ్యం అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల వద్ద సుమారు రూ.30 వేలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.90 లక్షల నగదును అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ మోహన్ తెలిపారు.