అక్రమార్జన, అక్రమ ఆస్తులను కలిగి ఉన్న అధికారులపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది. అవినీతి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసుపై ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేసింది. అవినీతి నిరోధక శాఖ అదికారులు వచ్చే సమయానికి ఎవరు ఎక్కడ ఉన్నారో వారిని అక్కడే ఉంచేశారు. పూర్తిగా సోదాలు పూర్తయ్యే వరకు ఎవ్వరిని కదలనివ్వలేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక సామాన్యులు ఆందోళనకు గురయ్యారు. 


కార్యాలయంలో రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంపై  ఏసీబీ రైడ్ చేసింది. ఏకాలంలో సోదాలు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాఘవరావు పని చేస్తున్నారు. ఆయన అక్రమంగా స్థిర, చరాస్తులు ఆర్జించారని సమాచారంతో అధికారులు దాడులు చేశారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఏకకాలంలో ఆయన నివాసం, కార్యాలయంతోపాటు ఇతర నాలుగు ప్రదేశాల్లో కూడా సోదాలు చేశారు.


కర్నూలులో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో రైడ్స్‌ జరిగాయి. కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్- రిజిస్ట్రార్ ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. కర్నూలు నగరంలోని ఐదు ప్రాంతల్లోని ఆమె బంధువుల ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. కర్నూలు అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారుల బృందం రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది. 


రెండు రోజులుగా సాగిన తనిఖీల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రేమరపోగు సుజాత వద్ద భారీగా ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలులోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు
కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు
కర్నూలు టౌన్ కస్తూరి నగర్ కాలనీలో ఇల్లు
కర్నూలు టౌన్‌ బుధవారిపేటలో G+1 దుకాణంతో కూడిన ఇల్లు 
కర్నూలు టౌన్‌ బుధవారిపేటలో మరో దుకాణం
కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి 
కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000 విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు 
40 తులాల బంగారం
ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు 
ఒక 2 వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం, గృహోపకరణాలు, రూ. 8,21,000/- నగదును ఇప్పటి వరకు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది.


అవినీతి అధికారులపై ఫిర్యాదు కోసం 14400.
ఎవరైనా అధికారులు వేధిస్తే అవినీతి నిరోధక శాఖ అందుబాటులో ఉంచిన 14400 నెంబర్‌కు సంప్రదించవచ్చని డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్న అధికారులు చిట్టాను ఏసీబీ అధికారులు రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా శాఖల్లో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరి ఇంటిపై అధికారులు పడతారో అన్న భయంతో కొందరు అవినీతి అధికారులు కాలం గడుపుతున్నారని జిల్లాల్లో చర్చ నడుస్తోంది.