AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ..  టీడీపీ ఓడిపోతుందని తెలిసినప్పుడు చంద్రబాబు రాక్షస అవతారం ఎత్తుతారని విమర్శించారు. ఎన్నికల ముందు ఐపీఎస్‌ల మార్పుచేర్పులకు పురందేశ్వరితో చంద్రబాబు లేఖ రాయించారని విమర్శించారు.  అధికారులను మార్చినచోటే హింస చెలరేగడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ అపాయింట్‌ చేసిన వారే సస్పెండ్‌ అవడం చరిత్రలో ఎరుగని విడ్డూరమని విమర్శించారు.  


చరిత్రలో ఎరుగని దాడులతో హింస
అంబటి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు జరిగాయి. ముఖ్యంగా పల్నాడు, రాయల సీమ జిల్లాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్నిచోట్ల పోలీసులు సైతం కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు కూడా కనిపించాయి. చంద్రబాబు ఆదేశాలతోనే పురందేశ్వరి ఈసీకి లేఖ రాసి పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను మార్పు చేయించారు. అధికారులను మార్చిన చోటే హింస చెలరేగింది. పల్నాడు జిల్లాలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున హింస జరిగింది. కొత్త ఎస్పీ వస్తే ఎన్నికలు బలంగా.. ప్రశాంతంగా జరగాలి కదా..? మరి ఎందుకు హింస చెలరేగింది? ఈ మార్పులు చేర్పుల మీదనే అసలైన కుట్ర జరిగింది’ అని అంబటి ఆరోపించారు. 


‘టీడీపీ తరఫున చంద్రబాబు, బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన పవన్‌కళ్యాణ్‌ కలిసి ఈ కుట్ర చేశారా..? ఎన్నికల కమిషన్‌కు పనిగట్టుకుని ఫిర్యాదులిచ్చి ఐపీఎస్‌లను మార్పులు చేర్పులు చేసి తమ తప్పుడు ఓట్లను వేయించుకోవాలనే గందరగోళంలోనే ఇంత హింస జరిగిందా..? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.  నరసరావుపేట నియోకవర్గం వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలిచాం. ఈసారి కూడా ఏడింటిని కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. దానికి అడ్డుకోవడానికి టీడీపీ, బీజేపీ, జనసేన హింసకు పాల్పడ్డారనే అనుమానం కలుగుతుంది. ఎన్నికల కమిషన్‌ నియమించిన ఐపీఎస్‌ అధికారులనే సస్పెండ్‌ చేసిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని చరిత్రలో ముందెన్నడూ చూడలేదు.’ అని అంబటి రాంబాబు అన్నారు.


చంద్రబాబు రాక్షసుడు
‘రాష్ట్రంలో అల్లర్లు, హింస వెనుక ప్రధాన కుట్ర చంద్రబాబుదే. ఆయన ఓడిపోతానని తెలిసిన రోజు చంద్రబాబు వ్యక్తి రాక్షసంగా క్రూరంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదని తెలిసినప్పుడు హింసను ప్రోత్సహిస్తాడు. పోలింగ్‌ రోజున తలలు పగిలి పోలీసులకు సమాచారం ఇస్తే కనీసం అక్కడికి రాలేదు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, సత్తెనపల్లిలో కొన్నిచోట్ల తీవ్రంగా దాడులు జరుగుతున్నాయని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ఇరువర్గాలు కొట్టుకుని అలసటతో వాళ్లే ఆగిపోయారు. అప్పటికే రెండు వర్గాల్లో చాలామందికి తలలు పగిలి రక్తం పారింది. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటి మీద టీడీపీ రౌడీమూకలు దాడి చేశారు. నా అల్లుడు కారు ధ్వంసం చేశారు. ఇంత దారుణంగా ఫెయిల్యూర్‌ అయిన పోలీస్ వ్యవస్థను చరిత్రలో చూడలేదు.’ అని ధ్వజమెత్తారు.


అవినీతి పోలీసులపై వేటు వేయాలి 
‘బ్రిజ్‌లాల్‌ నాయకత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌ అధికారులను నరసరావుపేటలో కలిశాను. దాడులు జరిగిన విధానాన్ని వారికి వివరించాను. రుజువులు, ఆధారాలు నివేదిక రూపంలో సమర్పించాం. పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి సిబ్బంది టీడీపీతో కుమ్మక్కయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు దగ్గర సీఐలు, ఎస్సైలు ఎంతెంత తీసుకున్నారో స్పష్టమైన సమాచారం ఉంది. కొంత మంది పోలీసు అధికారులు టీడీపీ ఇచ్చిన ఆఫర్లను తోసిపుచ్చారు. తప్పుడు అధికారులను సిట్ గుర్తించి చర్యలు తీసుకోవాలి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని తొండపి గ్రామంలో ముస్లింల ఇళ్లు, బండ్లు, బైకులను టీడీపీ నేతలు తగలబెట్టారు. మైనారిటీలో ఇతర ఊర్లకు వెళ్లి తలదాచుకున్నారు. వారందరిని తిరిగి ఇంటికి తీసుకురావాలి’ అని అంబటి కోరారు. 


రీపోలింగ్ నిర్వహించాలి
‘ పోలీసుల సాయంతో టీడీపీ మూకలు పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రిగ్గింగ్‌లకు పాల్పడ్డారు. ఆయా బూతుల్లో రీ పోలింగ్‌ పెట్టాలని కోరాం. అయితే రీ పోలింగ్‌ అవసరం లేదని ఎన్నికల కమిషన్‌ చెప్పడం విడ్డూరం. దాడులు, అల్లర్లకు కారకులెవరో నిగ్గు తేల్చాలని సిట్‌ను, ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.  ఎవరైతే, అవినీతికి పాల్పడ్డారో, విధుల్లో అలసత్వం ప్రదర్శించారో వారందరిపైన వేటు వేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.