Rains In Telugu States: తెలంగాణలో ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లాలో వర్షం బీభత్సం స‌ృష్టించింది. యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లి గ్రామంలో శ్రీనివాస్‌, లక్ష్మమ్మ, బెన్నూరు గ్రామంలో వెంకప్ప పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే హైదారబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బేగంపేట, ప్యారడైజ్‌, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్‌, జవహర్‌నగర్‌, జీడీమెట్ల, కొంపల్లి, సుచిత్ర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా దర్శిలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొద్ది రోజులుగా వేసవి ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. నంద్యాల, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని పలు చోట్ల వర్షం కురిసింది. సత్యసాయి, ఉమ్మడి కడప, తిరుపతి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. 


అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మాల్దీవులు, కోమరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకూ నైరుతి రుతుపవనాలువిస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ/నైరుతి దిశగా గాలులు వీస్తాయని వెల్లడించారు. ఐఎండీ తాజా అంచనా ప్రకారం మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలోనే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతు పవనాలు దేశంలోకి జూన్ 1న ప్రవేశించి.. కేరళను తాకి ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తాయి. 


ఏపీలో వర్షాలు
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల 30 - 40 కి.మీల ఈదురుగాలల వేగంతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అటు, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.


తెలంగాణలో 5 రోజులు వర్షాలు
అటు, తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 20న తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని చెప్పారు. 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా వర్షపాతం నమోదు కావొచ్చని అన్నారు. అలాగే, ఈ నెల 23న ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.