Minister RK Roja : 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని రాష్ట్ర టూరిజం, యువజన శాఖ మంత్రి రోజా ప్రశ్నించారు. పొత్తులపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రకటనపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పరిపాలన చూసి కడుపుమంటతో చంద్రబాబు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతికూలంగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా అధికార దాహంతో చంద్రబాబు తహతహలాడుతున్నారని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానుల్ని చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కల్యాణ్ కు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత సత్తా లేదన్నారు. ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కు సవాల్ విసరాలని హితవు పలికారు. చంద్రబాబు అండ్ కో టీమ్ కు అధికారంపై తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. 


సీఎం జగన్ సంక్షేమ సామ్రాట్ 


చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని మంత్రి రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లు గ్రామాల్లో తిరిగి విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పడానికి పవన్ కల్యాణ్‌ ఏమైనా దేవుడా జ్యోతిష్యుడా అంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సీఎం జగన్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజల బాగుకోసం ఆలోచన చేయలేదన్నారు. క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలు చంద్రబాబును గత ఎన్నికల్లో ఇంటికి పంపించారన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వాన పాములు బుసలు కొడుతున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు చెందుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ సామ్రాట్ అనడంలో సందేహం లేదని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. 


Also Read : Minister RK Roja : సెల్వమణి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా, రివర్స్ లో నిర్మాతలకు కౌంటర్


Also Read : RK Selvamani: రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలతో ఏపీలో దుమారం! తక్షణం మంత్రి క్షమాపణకు టీడీపీ డిమాండ్