Janasena On G.O No 1 : విపక్షాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్ధరాత్రి హడావిడిగా ఉత్తర్వులిచ్చారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.  ఈ జీవో తో వైఎస్ఆర్సీపీ తన నిరంకుశ ధోరణిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. ఆ నిరంకుశత్వానికి కొనసాగింపే హోమ్ శాఖ ద్వారా ఇప్పించిన చీకటి జీవో-1 అన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు కూడా ఉంటాయని గుర్తు చేశారు. ఆర్టికల్ 19ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందా? అని ప్రశ్నించారు. ఇలానే ముందు ముందు కచ్చితంగా ఏదొక రోజు జీవించే హక్కును కూడా సీఎం జగన్ హరిస్తారని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. సీఎం జగన్ పై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతోందన్నారు. పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న కౌలు రైతు భరోసా సభల్లో, జనవాణి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. విశాఖలో స్వచ్ఛందంగా జనం తరలివచ్చి పవన్ కు స్వాగతం పలకితే..నిర్బంధించడం అందరూ చూశారని గుర్తు చేశారు. ఇటీవల సత్తెనపల్లిలోని జనసేన కౌలు రైతు భరోసా సభను అడ్డుకోవాలని చూడటం వాస్తవం కాదా? అని మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఆంక్షలు విధించి, నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. 


ప్రత్యేక సందర్భాలు వైసీపీ మాత్రమేనా


ముఖ్యమంత్రి హోదాలో జగన్ విజయవాడ బెంజి సర్కిల్లో అన్ని దారులు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ బండ్లకు జెండాలు ఊపలేదా?  అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా? అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన అనగానే అన్నీ రూట్లలో షాపులు మూయించేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు పార్టీ కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారని ఆరోపించారు. ఇవేవీ జనజీవనాన్ని స్తంభింపచేయడం లేదా? శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీ సమావేశాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర హోం శాఖకు ఉందన్నారు. పోలీసులకు ముందుగానే అనుమతులకు లేఖలు ఇచ్చినా తగినంత భద్రత ఇవ్వడం లేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయం లేకపోతే చీకటి జీవో ఉపసంహరించుకొని ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలకు పూర్తి భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సందర్భాలు అనేవి కేవలం వైసీపీకి మాత్రమే వస్తాయా? అనే ప్రశ్నకు జీవో ఇచ్చిన ఉన్నతాధికారి, జీవో ఇప్పించిన పాలకులు సమాధానం ఇవ్వాలన్నారు. 


నిరంకుశ నిర్ణయం -అచ్చెన్నాయుడు


ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణదొక్కేందుకే జీవో-1 అని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నిరంకుశం నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయకూడదని అనుకోవడం ప్రజాస్వామ్యాన్ని హరించడమని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు ప్రజాదరణ చూసి జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. అప్రజాస్వామికమైన జీవో నెం.1 ని వెంటనే రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.