CM Jagan Review : ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధనను అమలు చేయాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై  సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వహించారు. ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్ఞానం అందించాల‌ని సీఎం జగన్ ఆదేశిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను సీఎం జ‌గ‌న్ ప‌రిశీలించారు. నాడు-నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న  పనుల వివరాలను సీఎంకు అధికారులు వివ‌రించారు. 






సీసీ కెమెరాల ఏర్పాటుపై 


రెండోదశ నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విలువైన పరికరాలు ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునేందుకు విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా నిరంతరం అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలన్నారు. దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలని, టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలని సీఎం జగన్ సూచించారు. 


డిజిటల్ మౌలిక సదుపాయాలపై సమీక్ష


విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డిజిటల్ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మార్ట్‌ బోధన సదుపాయాలతో పిల్లలకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. తరగతి గదుల్లో ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యతతో ఉండాలన్నారు. పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు పెట్టేలా ఆలోచన చేయాలన్నారు. అన్ని హైస్కూళ్లలోను, నాడు-నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశిచారు. వచ్చేవారానికి దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. 


ట్యాబ్ లన్నీ నాణ్యంగా ఉండాలి


సెప్టెంబరు నెలలో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లపైనా సీఎం సమీక్షించారు. ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ట్యాబ్‌ల్లోకి బైజూస్ కంటెంట్‌ లోడ్‌ చేయనుందని సీఎం తెలిపారు. విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. వచ్చే ఏడాదికి విద్యాకానుకకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలన్నారు. ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్లలో కూడా నాడు–నేడు పనులను రెండోదశ కింద చేపట్టాలని జ‌గ‌న్ అన్నారు.