Byreddy On Chandrababu : నీతిమంతుడిని అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు..అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతానని ఆనాడు వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్న సంగతి మర్చిపోయారా అంటూ శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విరుచుకుపడ్డారు. బాలకృష్ణ విషయంలో వైస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు లోకేశ్ గుర్తు తెచ్చుకుంటే మంచిదన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వీరులం శూరులం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..సోనియా కాళ్లు పట్టుకుని జగన్ పై కేసులు పెట్టించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మీరెన్ని అక్రమ కేసులు పెట్టించినా ప్రజాన్యాయ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గెలిచారని చెప్పారు. 


ఆ రూ.251 కోట్లు ఏమయ్యాయో లోకేశ్ చెప్పాలి


2014–19 లో సీమెన్స్‌ కంపెనీతో ఒప్పందం అని చెప్పి చంద్రబాబు, లోకేశ్ రూ.250 కోట్లు దోచుకున్నమాట వాస్తవం కాదా? సీమెన్స్‌ కంపెనీలతో ఒప్పందం అని 5, 6 షెల్‌ కంపెనీలు ఓపెన్‌ చేసి ఆ కంపెనీలకు రూ.250 కోట్లు తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా? అని బైరెడ్డి ప్రశ్నించారు. ఆ రూ.251 కోట్లు ఏమయ్యాయో నారా లోకేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం పేరుతో జరిగిన దోపిడీపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపట్టాలని, దోపిడీ దారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


అవినీతిలో ఆరితేరిన చంద్రబాబు 


చంద్రబాబు అవినీతిలో ఆరితేరారని బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆరోపించారు. రాజధాని భూములపై విచారణ అడిగితే స్టే తెచ్చుకున్నాడని, అచ్చెన్నాయుడి స్కాంపై విచారణ అంటే స్టే అన్నాడు, సంగం డైరీలో ధూళిపాళ్ల అవినీతిపై విచారణ చేద్దామంటే స్టే తెచ్చుకున్నాడు, చంద్రబాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి కేసు వేస్తే స్టే తీసుకున్నాడు, విదేశీ పెట్టుబడులపై విచారణ చేద్దామంటే స్టే..ఇలా అన్నింట్లో స్టే తెచ్చుకున్న అవినీతి పరుడని విమర్శించారు. చంద్రబాబు తన బినామీ అయిన పోతిరెడ్డి పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి ఏలూరు కాలువకు సంబంధించిన పరిహారం సొమ్మును దోచుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై వేల పుస్తకాలు వేయొచ్చని బైరెడ్డి దుయ్యబట్టారు. 


ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదు..మనిషే ఫెయిల్యూర్


సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడేటప్పుడు లోకేశ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని బైరెడ్డి సిద్దార్థరెడ్డి సూచించారు. లోకేశ్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదని..మనిషే ఫెయిల్యూర్ అని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో గెలవలేని లోకేశ్..పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకోస్తాడా అంటూ విమర్శించారు. లోకేశ్ నెత్తమీద రూపాయి పెట్టినా పావలాకు చెల్లడన్నారు. 


"ఏపీలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయమని టీడీపీ నేతలే చంద్రబాబుతో అంటున్నారట. సీఎం జగన్‌పై లోకేశ్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారట. లోకేశ్ ఒక ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌, వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి ఖాయం.  ప్రజాన్యాయస్థానంలో గెలిచిన నేత సీఎం జగన్. సీఎం జగన్‌పై కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టించారు. సీఎం జగన్‌ నిత్యం ప్రజల గురించే ఆలోచించే నేత. ఉద్దానం సమస్యను పరిష్కారం చూపించింది సీం జగన్. టీడీపీలాగా అబద్దపు హామీలు ఇచ్చే అలవాటు వైసీపీ ప్రభుత్వానికి లేదు.  ఐదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నాం. మంత్రి రోజాను మహిళ అని కూడా నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.  ఇది కరెక్ట్‌ కాదు. " - బైరెడ్డి సిద్ధార్థరెడ్డి