Volunteer Petition against Pawan : విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పరువునష్టం పిటిషన్ దాఖలైంది. పవన్పై పిటిషన్ వేశారు ఓ వాలంటీర్. వాలంటీర్ ఇచ్చిన పిటిషన్ను విచారణకు స్వీకరించారు న్యాయమూర్తి. తమపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురై న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినంటున్నారు మహిళా వాలంటీర్.. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు.. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని.. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. ఈ కేసులో పవన్ కల్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందంటున్నారు బాధితురాలి తరపున న్యాయవాదులు.. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి.. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు.. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని అంటున్నారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని.. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలన్నారు. వదంతులతో ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరినట్టు వెల్లడించారు బాధిత వాలంటీర్ తరపు న్యాయవాదులు.
ఇప్పటికే ప్రభుత్వం కూడా పవన్ పై పరువు నష్టం కేసు వేయాలని నిర్ణయించింది. మహిళల అక్రమ రవాణా వెనుక వాలంటీర్ల హస్తం ఉందని అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ వెంటనే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ సైతం నోటీసులు పంపింది. ఈ మేరకు వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన వార్తల ఆధారంగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై సీసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ.. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ప్రభుత్వం నోటీసులు పంపింది. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. అయితే ముందుగా వాలంటీర్ తో పిటిషన్ దాఖలు చేయించడం వ్యూహాత్మకమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.