Annadata Sukhibhava Scheme 2025: తాడేపల్లి: తన హయాంలో రైతు భరోసా ఇచ్చేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్వయంగా నిజాన్ని ఒప్పుకున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు అంశాలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
1. ఎన్నికలకు ముందు అధికారం కోసం చంద్రబాబు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ ఇస్తారు, బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను గ్యారెంటీగా మోసం చేస్తారని ఈరోజు మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు చంద్రబాబు వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
2. మా YSRCP హయాంలో అత్యంత సమర్థవంతంగా అమలుచేసిన రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Scheme) దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ, మీ ష్యూరిటీలు, మీ బాండ్లు మొత్తం మోసాలే. మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.
3. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి సభలో మీ (చంద్రబాబు) నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా రాదన్నది ముమ్మాటికీ నిజమే.
4. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలలలోనే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేకున్నా అక్టోబరు 2019లో రైతు భరోసా అమలు ప్రారంభించి 5 ఏళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించాం. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా తెలిపాం. మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు.
5. వైసీపీ 2019 మేనిఫెస్టోలో 4ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేశాం. కానీ మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏడాది రూ.13,500 ఇచ్చాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించాం.
6. కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, ప్రతి ఏడాది రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారు. ఈ 2 సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటివరకు కేవలం రూ.5వేలు ఇచ్చారు. అది ఎంతమందికి వచ్చిందో తెలియదు. ఖరీఫ్ మొదలై 2 నెలలు గడిచినా పెట్టుబడి సాయం చేయకుండా రైతులను మళ్లీ వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.
7. వైఎస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు నిబంధనలతో సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి అన్యాయం చేశారు. వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని స్పష్టంగా కనిపిస్తోంది. దర్శిలో ఈ కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని రైతులు, రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
8. వైయస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మేం నిలబెడితే, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.
9. ఏపీలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మేం ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.7,800 కోట్లతో రైతులను ఆదుకున్నాం. మీరు దాన్ని రద్దుచేసి రైతులను గాలికొదిలేశారు.
10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది.
11. అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లను వైసీపీ అందించి, రైతులను ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తోంది. గత ఏడాది బీమా నగదు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .
12.ఆర్బీకేలను, ఇ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను చంద్రబాబు నిర్వీర్యం చేశారు.
13. ఆర్బీకే(RBK)ల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మా హయాంలో అందిస్తే, మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి.. కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకువచ్చారు.
14.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం’ అని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.