Telangana budget 2022-23: వ్యవసాయంపై స్పెషల్ ఫోకస్‌ చేసినట్టు పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు బడ్జెట్ ప్రసంగంలో వివరించిన హరీష్‌ రావు... రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలను కూడా తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం రంగంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి సాధించామన్నారు. సస్యశ్యామల తెలంగాణ సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. 


నాడు అదోగతి-నేడు ఆదర్శం


ఉమ్మడి  రాష్ట్రంలో పదేళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన నిధులు 7,994 కోట్లు మాత్రమేనన్న హరీష్‌... తెలంగాణ ఏర్పడి నప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయంపై 83, 989 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. 2014-15లో తెలంగాణ ప్రాంత సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఏకరాలు కాగా అది 2020-21 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి ఉండగా...  2020-21 నాటికి 218.51 లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ ప్రవేశ పెట్టిన రైతు బంధ పథకాన్ని ఆంధ్రప్దేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలు అమలు చేశాయని తెలిపారు హరీష్. కేంద్రం కూడా ఈ పథకాన్ని అనుసరించిందన్నారు. అంతర్జాతీయంగా కూడా చాలా ప్రశంసలు వచ్చాయని పేర్కొన్నారు. 


వ్యవసాయ వృద్ధిలో టాప్


వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14లో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 4శాతం మాత్రమే ఉందని.. ఇప్పుడు అది 29 శాతానికి పెరిగిందని తెలిపారు హరీష్‌. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. రాష్ట్ర వచ్చే నాటికి 18. 45 టన్నులుగా ఉన్న ఉత్పత్తి నేడు 31. 60 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. 


మార్చిలోపు రుణ మాఫీ


తెలంగాణ ఏర్పడిన తర్వాత 35. 32 లక్షల మంది రైతులకు చెందిన 16, 144 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ దఫా రుణ మాఫీలో భాగంగా ఇప్పటి వరకు 5. 12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 50వేల రూపాయల లోపు రుణాలు ఈ మార్చిలోపు మాఫీ అవుతాయన్నారు హరీష్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. వ్యవసాయ రంగానికి వార్షిక బడ్జెట్‌లో 24, 254 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ప్రభుత్వం. 


తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల  ఎకరాలకు మాత్రమే సాగు నీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి 85,89 లక్షల  ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలిగిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వం. 


పచ్చదనం అభివృద్ధి కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హరిత నిధిని ఏర్పాటు చేశామన్నారు హరీష్‌ రావు. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజాంలోని ఇతర వర్గాల వారందరినీ భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వం వారి నుంచి విరాళాలను సేకరించిందన్నారు. దీని వల్ల హరితహార కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రభుత్వం తరఫున 932 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొన్నారు.