దళారుల ప్రమేయం లేకుండా టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ కొత్త ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్‌కు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి నేతృత్వంలో ప్రక్రియ పూర్తైంది. దాదాపు 20 వేల మంది టొమాటో రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ. (Farmer Producer Organizations)లతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డెవలెప్మెంట్ జరుగనుంది.
                                                       

  
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే టొమాటో రైతుల సంక్షేమానికై జగనన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని తెలిపారు. మార్కెట్, దళారుల ప్రమేయం లేకుండా టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించి.. వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్ కు చర్యలు చేపట్టిందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్...


కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్ కింద టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు కాకాణి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ జగనన్న ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఏర్పాటు చేసిందన్నారు. సాధారణంగా డిమాండు, సప్లైకి అనుగుణంగా టొమాటో ధరలో హెచ్చుతగ్గులు ఉందడం వల్ల వినియోగదారులపై, రైతులకు భారంగా ఉంటుందని వివరించారు. టొమాటో ధరలు అధికంగా ఉన్నప్పుడు వినియోగదారులకు ఉపశమాన్ని కల్పించేందుకు, ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తుందని పేర్కొన్నారు. 


ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడటం వల్ల డిమాండుకు మించి దిగుబడి రావడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు కాకాణి. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్ కు చర్యలు చేపట్టామని వివరించారు. ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ , లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్‌తో నేడు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.110 కోట్ల అంచనా వ్యయంతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు కాకాణీ. వీటిలో 4 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల నిర్మాణ పనులు పూర్తయినాయని, వచ్చే నెల్లో వాటిని ప్రారంభించడానికి చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యతను ఎఫ్.పి.ఓ. లకు అప్పగించామన్నారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర ప్రాసెసింగ్ ప్రక్రియకు వంటి కెపాసిటీ బిల్డింగ్ పనులకు ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ సహకరిస్తుందని వెల్లడించారు. మార్కెటింగ్ చైన్ అభివృద్దికి లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్ సహకరిస్తుందన్నారు. అందరి భాగస్వామ్యంతో టొమాటో రైతులను అన్ని విధాలుగా ఆదుకొనేందుకు, కనీస మద్దతు ధరను కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించి పూర్తి స్థాయిలో టొమాటో రైతులకు లబ్దిచేకూర్చాలనే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం ఈ చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు.