Sericulture in Andhra Pradesh: ఏపీలో పట్టు పరిశ్రమ కోలుకుంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా దయనీయంగా మారిన పరిశ్రమకు ఇప్పుడు క్రమేణా మంచి రోజులు వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధిక దిగుబడితో రాబడి పెరిగిందని రైతులు అంటున్నారు. ఈ మార్కెట్ (E Market) విధానంలో పట్టు గూళ్ళ విక్రయాలు జరగటంతో దళారుల ప్రమేయం లేదని చెబుతున్నారు.
పట్టుకు పూర్వ కళ....
పట్టు మార్కెట్ కు పూర్వ కళ వచ్చింది. డిమాండ్ తో పాటుగా పెరిగిన ఉత్పత్తితో మార్కెట్ కళకళ లాడుతోంది. ఈ మార్కెట్ విధానం అమలుతో దళారులకు చెక్ పడింది. రైతులకు ఆదాయం, ప్రభుత్వ ఖజానాకు కాసులు వచ్చిపడుతున్నాయి. పట్టు పరిశ్రమ పూర్తిగా ప్రకృతి పైనే ఆధారపడి ఉంటుంది. రైతులు ప్రకృతిలోని వనరులను వినియోగించుకుని, వాటిని గూళ్ళుగా పరిరక్షించి సహజసిద్ధంగా పట్టు గూళ్ళను రెడీ చేస్తుంటారు. అయితే గత రెండు సంవత్సరాలుగా పట్టు పరిశ్రమకు పూర్తిగా గడ్డు కాలమనే చెప్పాలి. దీనిక తోడు మధ్యవర్తుల ప్రమేయంతో మార్కెట్ పూర్తిగా నాశనం అయ్యిందని రైతులు తీవ్ర ఆవేదనలో ఉండే పరిస్థితులు నుంచి నేడు మరోసారి పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పట్టుగూళ్ల విక్రయ కేంద్రం మరోసారి పట్టు రైతులతో కళకళ లాడుతుంది. తెలుపు రంగులో పట్టు గూళ్ళు మార్కెట్ లకు తరలి వస్తుంది. ఇక్కడ ఈ మార్కెట్ ద్వారా డిమాండ్ కు అనుగుణంగా సరుకును దక్కించుకున్న వ్యాపారులు స్టాక్ ను ప్రోసెసింగ్ సెంటర్ కు తరలించి, అక్కడ నాణత్య మేరకు ముడి సరుకును తయారు చేసుకుంటారు. అలా తయారైన ముడి సరుకును మగ్గం కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ వివిధ రకాల దుస్తులు, ఉత్పత్తులు తయారు చేస్తుంటారు.
ఏడు జిల్లాలకు ఇదే అతిపెద్ద మార్కెట్....
ఉమ్మడి కృష్ణాజిల్లా లోని హనుమాన్ జంక్షన్ లో పట్టుగూళ్ల విక్రయ కేంద్రం ఉంది. కోస్తా జిల్లాలో ఎక్కడ పట్టు పరిశ్రమలు ఉన్నా, వాటి సరుకు మాత్రం ఇక్కడకు రావాల్సిందే. పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుపుతున్న మార్కెట్ కావటంతో గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఇక్కడకు రావటానికి మక్కువ చూపుతుంటారు. కానీ చాలా మంది దళారులు రైతులను నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వం పక్కాగా ఈ మార్కెట్ ను అమలులోకి తీసుకువచ్చింది. దీని వల్ల రైతులు ఎక్కడ ఉన్నా తమ పంటను విక్రయించుకునేందుకు అవకాశం కలిగింది. అదే విధంగా కొనుగోలు దారులు ఈ మార్కెట్ లోనే క్రయవిక్రయాలు జరుపుతున్నారు. 
రైతులకు గిట్టుబాటు ధర లభించటంతో పాటుగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభిస్తోంది. గత ఏడాది నవంబర్ నాటికి 88టన్నుల పట్టు లావాదేవీలు జరిగాయి. దీంతో మార్కెట్ యార్డ్ కు 5 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది నవంబర్ నాటికి అత్యధికంగా 172 టన్నుల స్టాక్ వచ్చింది. మార్కెట్ ఫీజ్ కింద 13 లక్షల రూపాయలు ఆదాయం లభించిందని మార్కెట్ అధికారి దుర్గారావు వెల్లడించారు. ఏడు జిల్లాల నుంచి రైతులు తమ పంటను ఇక్కడి మార్కెట్ కు తీసుకురావడంతో రైతులకు ఆశించిన ధర లభిస్తుందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోల్చితే డిమాండ్ పెరగటంతో, మార్కెట్ ఊపందుకుందని వెల్లడించారు.