Viral News: వ్యవసాయంపై మక్కువ ఆ రైతును నిలవనీయలేదు. ఆ స్థోమత లేకపోయినా బిడ్డల్నే కాడెద్దులుగా చేసి పొలంలో కలుపు మొక్కలు తీశాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్‌గా మారుతున్నాయి. బడికి పోవాల్సిన ఆ చిన్నారులు కాడెద్దులుగా మారిన ఘటన అనంతలో రైతులు పడుతున్న కష్టానికి ఉదాహరణగా చెబుతున్నారు. 


రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడటంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. పెరిగిపోయిన ఖర్చులకు తగిన ఆదాయం లేక చాలా మంది రైతులు తమ వద్ద ఉన్న ఎద్దులు, ఇతర సామాగ్రి అమ్మేశారు. కొందరు పొలాలను కూడా వదిలించుకున్నారు. కానీ మరికొందరు భూమిపై ఉన్న మక్కువతో ఖర్చులు సాగును మాత్రం కొనసాగిస్తున్నారు. అలాంటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.


ప్రస్తుత కాలంలో రైతులకు వ్యవసాయం గుదిబండల మారింది. వర్షాలు వచ్చాయంటే చాలు రైతులు ఎన్నో ఆశలతో పొలాల్లో సాగుకు సిద్ధమవుతారు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ ఖర్చులు అధికం అవుతుండడం రైతులకు భారంగా మారుతుంది. విత్తనం వేసుకోవడానికి ముందుగా తమ పొలాలలో సేద్యం, కలుపులు తీసుకోవడం కూలీల ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే  వర్షం ఇచ్చిన ఆనందం కంటే సాగు ఖర్చులు తలచుకొని భయపడాల్సి వస్తుంది. 




ఇప్పుడు మన చూసిన ఈ ఫొటోలు అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో శార్దానప్ప అనే రైతు తన పొలంలోనిది.  టమాటో పంట సాగు చేసే శార్దానప్ప ఈసారి కూడా పంట వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలంలో కలుపు మొక్కలు పెరిగాయి. 




కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలను పురమాయించాలి. దానికి చాలా ఖర్చు చేయాలి. దున్నించాలి అంటే ఎద్దులు లేకపోయే. వేరే వాళ్లకు చెబితే బాడుగ ఎక్కువ ఇవ్వాలి. ఎద్దులు కొనే స్తోమలేని రైతు కుటుంబం సాయం తీసుకున్నాడు. 




ట్రాక్టర్‌తో సేద్యం చేయించాలంటే కూడా ఖర్చు మేపెడు అవుతుంది. పొలాన్ని వదిలేద్దామా అంటే మనసు ఒప్పుకోవడం లేదు. చేసేదిలేక కలుపు తీసేందుకు తన ఇద్దరు కుమారుల సాయం తీసుకున్నాడు. వారినే కాడెద్దుల్లా మార్చాడు. పుస్తకం పట్టి చదువుకోవలసిన బిడ్డలు ఇలా కాడె పడుతుంటే మనసు చివుక్కుమన్నా శార్ధనప్పకు తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు కార్తీక్ ఇంటర్ చదువుతున్నాడు. రెండో కుమారుడు రాణా ప్రతాప్ పదో తరగతి చదువుతున్నాడు. పని పూర్తి అయిన తర్వాత వారిని చదువుకు పంపించాడు. 




వీరిద్దరితో శార్ధనప్ప తన టమోటా పంటలో పెరిగిన కలుపు మొక్కలు తీయించాడు. స్థానిక రైతులు వారి వీడియో ఫోటోలను తీశారు. ఇవి అనంతపురం జిల్లాలోని రైతుల కష్టాలకు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 




ఆపన్న హస్త అందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే : 


చిన్నారులు పొలంలో కలుపు నివారణకు తండ్రితోపాటు కాడెడ్లుగా మారి  చిత్రాలు చూసినా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. వెంటనే ఇద్దరు చిన్నారులను తాను చదివిస్తానని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు కూడా తానే భరిస్తానని ఎమ్మెల్యే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇచ్చారు.