Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం?
అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయంతో ఈ సిరీస్కు దూరం కాబోతున్నాడనే వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
కోహ్లీ గాయం నిజమేనని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు. విరాట్ లాంటి ప్లేయర్ దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలు ప్రారంభించే టీమిండియాకు తీరని లోటని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ thigh muscle injuryతో ఇబ్బంది పడ్డాడు.
షాకింగ్ విషయం ఏంటంటే.. కేవలం కోహ్లీ మాత్రమే కాదు, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడటంపై కూడా తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. రోహిత్ కూడా ఐపీఎల్ లో గాయపడి కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు రోహిత్, హార్దిక్ ఇద్దరూ బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వారు అక్కడికి వెళ్లలేదని సమాచారం. జూన్ 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరంతా అందుబాటులో ఉంటారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది.