Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించాడు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ను తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సుదర్శన్.. మొత్తంగా 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి దుమ్మురేపాడు.
ఈ హాఫ్ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్గా సాయి సుదర్శన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు 2012 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాది అగ్రస్థానంలో నిలిచాడు.
గత ఏడేళ్లుగా ఐపీఎల్లో ఎవరికీ సాధ్యంకాని ఈ రికార్డ్ను సాయి సుదర్శన్ బద్దలు కొట్టాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి కూడా ఈ ఫీట్ సాధ్యపడకపోవడం విశేషం.
ఈ సీజన్ మొదటి మ్యాచ్లో కేవలం 13 పరుగులకే అవుటైన సుదర్శన్, ఆ తర్వాత అస్సలు తగ్గలేదు. రాజస్థాన్పై 73, ఆర్సీబీపై సెంచరీ బాది..ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, సన్రైజర్స్, కేకేఆర్లపై వరుసగా 57, 55, 61, 53 నాటౌట్తో చెలరేగాడు. ఇక ఇప్పుడు సీఎస్కేపై 84 రన్స్ చేసి వరుసగా ఐదోసారి యాభైకి పైగా పరుగులు సాధించాడు.