Tek Fog Issue: దేశంలో మరో స్పై వేర్ దుమారం...టెక్ ఫాగ్ యాప్ పై ప్రతిపక్షాల సంచలన ఆరోపణలు
దేశంలో పెగాసస్ స్పైవేర్తో ప్రముఖులపై నిఘా పెట్టిన అంశం గురించి పూర్తి స్థాయి వివరాలు బయటకు రాక ముందే మరో సంచలనాత్మకమైన యాప్ విషయంలో దుమారం ప్రారంభమైంది. "టెక్ ఫాగ్ యాప్"తో భారతీయ జనతా పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని విప్కషాలు ఆరోపిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్తో ముప్పు పొంచి ఉందని ..ఈ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ కావాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఐటీ సెల్తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు టెక్ ఫాగ్ యాప్ను ఉపయోగించి ఇన్యాక్టివ్గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ యాప్ పలు ఫ్లాట్ఫారమ్లో కథనాలను భారీగా మార్చడానికి, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ఫ్లాట్ఫారమ్లకు చొచ్చుకుపోవడమే కాకుండా, సోషల్ మీడియా సందేశాలను భద్రత పర్చడం వంటి సామర్థ్యాన్ని కల్గి ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నట్లు ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి.