Pawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP Desam
ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం.. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామి వారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్... సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచ హారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా గురువారం తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించారు. ఈ ఆలయంలో శివలింగంతోపాటు ప్రతి అణువు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కుంభేశ్వరాలయ దర్శనానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం ఉంది. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆదివినాయగర్ ని మొదట అర్చించారు. శ్రీ ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాంఢం(కూజా) ఆకారంలో ఉన్న శివలింగ విశిష్టతను పవన్ కళ్యాణ్ కి అర్చకులు వివరించారు. అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరని తెలిపి, విశిష్ట పూజలు నిర్వహించారు. పంచ హారతులు ఇచ్చి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.