Tirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

 తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశికి దర్శించుకోవాలని భక్తులు పడిన తాపత్రయం...తీవ్ర విషాదాన్ని నింపింది. ఆఫ్ లైన్ లో టీటీడీ జారీ చేసే టోకెన్ల కోసం తిరుపతిలో పంపిణీ కేంద్రాల వద్దకు వేలాదిగా చేరుకున్న భక్తులు గేట్లు తీయగానే ఒక్కసారిగా లైన్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం తొక్కిసలాటకు కారణమైంది. ఫలితంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తొక్కిసలాటలో ఐదుగురు చనిపోగా...మరొకరు అస్వస్థతతో కన్నుమూశారు. 48 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలో శ్రీనివాసం, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తోపులాటలు, తొక్కిసలాట ఘటనలు జరిగాయి. టీటీడీ అధికారుల సమన్వయ లోపం, పోలీసుల వైఫల్యం, టోకెన్ల కోసం భక్తుల తాపత్రయంతో ఘటనకు కారణంగా తెలుస్తోంది.  మృతుల్లో ఐదుగురు మహిళలు కాగా..ఒక పురుషుడు ఉన్నారు.ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని...టీటీడీ ఉన్నతాధికారులంతా ఆసుపత్రి, టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈరోజు చంద్రబాబు తిరుపతికి చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola