Sampradaya Bhojanam: సంప్రదాయ భోజనాన్ని తక్షణమే నిలిపివేస్తున్నాం : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగ్గదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో మంచి ఉద్దేశంతో అధికారులు సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టారన్నారు. అయితే సంప్రదాయ భోజనంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే నేటి నుంచి సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
నవనీత సేవకు శ్రీకారం
కృష్ణాష్టమి సందర్భంగా తిరుమలలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఏ ఆహారమైన ప్రసాదం రూపంలోనే
నవనీతసేవ లాంటి ఒక కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సంప్రదాయబద్ధంగా గోవు పాలు,నెయ్యిని, వెన్నను సేకరించి అందిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందుకే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వదర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.