Viral News: చిన్న చిన్న పొరపాట్లకే ఒక్కో సారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లు అనే సామెత ఊరకే పుట్టలేదు. ఎందుకంటే కొందరు గాలికి పోయే కంపను నెత్తిన పెట్టుకుంటారు. అంటే చిన్న పొరపాటే కదా అని కావాలని, స్పృహ ఉండి మరీ చేస్తారు. చివరికి భారీగా మూల్యం చెల్లించుకుంటారు. అలాంటి ఓ అనుభవం మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తికి జరిగింది. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. అంతగా ఆ వ్యక్తి ఏం చేశాడు అనే కదా.. మీ అనుమానం. ఆ వ్యక్తి చేసింది తెలుసుకుంటే నవ్వు ఆగదు. 


అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. తాను వెళ్లాల్సిన రైలు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తన భార్య, 8 ఏళ్లు కుమారుడితో కలిసి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్తున్నాడు అబ్దుల్ ఖాదిర్. ఖాదిర్ డ్రై ఫ్రూట్స్ దుకాణాలు నడిపిస్తుంటాడు. తనకు హైదరాబాద్ లో ఒకటి, సింగ్‌రౌలీలో మరో రెండు దుకాణాలు ఉన్నాయి. తాజాగా అతడు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలు దేరాడు. కుటుంబంతో కలిసి భోపాల్ కు చేరుకున్నాడు. తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్లే రైలు కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో ఖాదిర్ కు ఆపుకోలేనంత అర్జెంటుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతలో అదే ప్లాట్‌ ఫారమ్ పై ఉన్న వందే భారత్ రైలు ఎక్కాడు.


అందులోని టాయిలెట్ వాడేసుకున్నాడు. తర్వాత టాయిలెట్ డోరు వేసి వందే భారత్ రైలు దిగడానికి డోరు వద్దకు రాగానే అవి కాస్త లాక్ అయిపోయాయి. రైలు కదలడం మొదలైంది. ఏం చేయాలో తెలియక అబ్దుల్ వేర్వేరు కోచ్ లలో ఉన్న ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు వందే భారత్ పోలీసు సిబ్బంది నుంచి సహాయం కోరాడు. కానీ వందే భారత్ రైలు డోర్లు తెరవడం తమకు సాధ్యం కాదని, కేవలం డ్రైవర్ మాత్రమే తలుపులు తెరవగలడని వారు ఖాదిర్ కు చెప్పారు. ఖాదిర్ డ్రైవర్ వద్దకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. 


భోపాల్ నుంచి ఇండోర్ వరకు టికెట్ లేకుండా వందే భారత్ లో ప్రయాణించినందుకు అతడికి రూ.1020 జరిమానా విధించారు అధికారులు. అబ్దుల్ ఖాదిర్ ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి, రూ. 750 టికెట్ తో భోపాల్ కు బస్సు లో వచ్చాడు. అబ్దుల్ వందే భారత్ రైలు ఎక్కి వెళ్లిపోవడంతో.. భోపాల్ స్టేషన్ లో అతని కుటుంబం ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయారు. ఇంతలో వారు సింగ్‌రౌలీకి వెళ్లే దక్షిణ్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. ఖాదిర్ లేకపోవడంతో వారు ఆ రైలు ఎక్కకుండా భోపాల్ స్టేషన్ లోనే ఉండిపోయారు. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ లో సింగ్ రౌలీకి వెళ్లాలనుకున్న రైలు ప్రయాణం కోసం బుక్ చేసిన రూ.4 వేలు టికెట్ లను వాడుకోలేకపోయారు. అలా అబ్దుల్ ఖాదిర్ వందే భారత్ రైలులో టాయిలెట్ వాడుకున్నందుకు ఏకంగా రూ.6 వేలు కోల్పోవాల్సి వచ్చింది.