Arogya Mahila Scheme: మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాన సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమమే "ఆరోగ్య మహిళ". ఇప్పటి వరకు  కలిపి 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మొదటి మంగళ వారం (ఈనెల 14న) 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 975 మందికి అవసమైన మందులు అందజేశారు. ఉన్నతస్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధిలక్షణాల పై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక ఇబ్బంది పడేవారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారు.


నిన్నటి రెండో మంగళ వారం (ఈనెల 21న) 6328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్ ను సందర్శించారు. వీరిలో 3753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3783 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 718 మందికి మూత్రకోష ఇన్ఫెక్షన్ల నిర్ధారణ పరీక్షలు, 1029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్ పరీక్షలు, 477 మందికి విటమిన్ - డి లోప పరీక్షలు, 1294 మందికి సిబిపి పరీక్షలు నిర్వహించారు.


100 కేంద్రాల్లో కొనసాగుతున్న సేవలు


సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ ప్ర‌త్యేకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టింది.  అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 8వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు క‌రీంన‌గ‌ర్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరిస్తారు. ఈ కేంద్రాల్లో ప్ర‌తి మంగ‌ళ‌వారం ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల‌కే 8 రకాల వైద్య సేవ‌లు అందిస్తున్నారు.


ఏమేం టెస్టులు చేస్తారంటే..


1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు


2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..


3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.


4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.


5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.


6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.


7, సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.


8, బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.


మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం - హరీశ్ రావు  


“సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం "ఆరోగ్య మహిళ" అనే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల కోసం 100 అరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం,  మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను”- హరీష్‌ రావు