నిన్న ఈశాన్య  బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు  అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల వాయువ్య, దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో  అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం నుంచి  ద్రోణి ఒకటి ఉత్తర ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి 1.5 కిమీ, 3.1 కిమీ ఎత్తు  మధ్యలో విస్తరించి ఉంది.


నిన్న  విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి సముద్ర మట్టంకి 0.9 కిమీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడింది. సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి ఆవర్తనము ఈరోజు బలహీన పడింది.


ఈరోజు, రేపు , ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు , ఎల్లుండి  రాష్ట్రంలో  భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు  రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ అన్నీ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.  


సెప్టెంబర్ 4న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.  నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ్ పేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వాయువ్య/పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


‘‘తెలంగాణ - ఆంధ్రా బార్డర్ పరిధిలో ముఖ్యంగా కర్నూలు, నంధ్యాల జిల్లాలను ఆనుకొని ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడింది. దీని వలన రానున్న మూడు గంటల వరకు కర్నూలు నగరంతో పాటుగా నంధ్యాల నగరం, అలాగే నంధ్యాల జిల్లాలోని వివిధ భాగాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలను చూడగలము. అలాగే మరో వైపున విజయనగరం జిల్లా భోగాపురం - భీమిలీ మధ్యన మరో భారీ వర్షం బంగాళాఖాతాన్ని ఆనుకొని పడుతోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.