ద్రోణి ఒకటి తూర్పు మధ్య ప్రదేశ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో గురువారం (మే 18) తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు  వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఎల్లుండి తేలికపాటి  నుండి మోస్తారు వర్షాలు  దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ  కురిసే  అవకాశం ఉంది. హైదరాబాద్  మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు  39 నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. 


20న తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 36 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.


రాష్ట్రంలో రేపు 29 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లా 5, గుంటూరు 1, కాకినాడ 1,  ఎన్టీఆర్ 2, పల్నాడు 2, మన్యం 5, విజయనగరం 5, వైఎస్సార్ జిల్లాలోని 8 మండలాలు, ఎల్లుండి 33 మండలాల్లో  వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.1 డిగ్రీలు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, వైస్సార్ జిల్లా బద్వేల్ లో 45 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవని, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు, 27 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు.


ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు బయటకు రాకుండా ఉండలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


రేపు కింద విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు


మే 19 శుక్రవారం
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  44 - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, SPSR నెల్లూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  42 - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


• కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  40 - 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.